దీపావళికి జయ డిశ్చార్జ్ ? ఫ్రాన్స్ లో యువతి అరెస్టు !
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం నుంచి కోలుకుంటున్నారని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు. జయలలిత త్వరలో డిశ్చార్జ్ అవుతారని స్వయంగా వైద్యులు చెప్పారని అన్నాడీఎంకే నాయకులు అన్నారు.
అన్ని అనుకున్నట్లు జరిగితే దీపావళి పండగను జయలలిత అభిమానులతో కలసి జరుపుకుంటారని అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. అమ్మ ఇంటికి చేరుకున్న రోజు మాకు పండగే అని, ఆ రోజు దీపావళి అయితే ఇంకా మంచిందని తమిళనాడు మంత్రులు అంటున్నారు.
జయ ఆరోగ్యంగా ఉండాలి: మోడీ
జయలలిత త్వరగా కోలుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తమిళనాడు గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు, కేరళ సీఎం పినరై విజయన్ ఆకాక్షించారు. గత నెల 22 నుంచి జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
ఊపిరిపీల్చుకున్న కార్యకర్తలు
గత కొంత కాలం నుంచి జయలలిత ఆరోగ్యంపై పలు పుకార్లు రావడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు, అమ్మ అభిమానులు ఆందోళన చెందారు. అయితే తాజాగా వైద్యులు చేసిన ప్రకటనతో అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు.
అమ్మ ఆశిర్వాదం కోసం
పుదుచ్చేరి ఉప ఎన్నికల్లో నెల్లతోప్పు నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఓం శక్తిశేఖర్ అపోలో ఆసుపత్రి చేరుకుని అమ్మ ఆరోగ్యం గురించి మంత్రులు, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అమ్మ ఆశిర్వాదంతో తాను కచ్చితంగా గెలుస్తానని ఓం శక్తిశేఖర్ ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ తో డీ అంటున్న అన్నాడీఎంకే
పుదుచ్చేరిలోని కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న సీఎం నారాయణ స్వామిపై ఓం శక్తిశేఖర్ పోటీ చేస్తున్నారు. అయితే ఓంశక్తిశేఖర్ గెలవడం అంత సులభంకాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అపోలో లో తిష్ట వేసిన మంత్రులు
అపోలో ఆసుపత్రిలో తమిళనాడు మంత్రులతో పాటు అన్నాడీఎంకే నాయకులు అందరూ అక్కడే తిష్టవేశారు. చెన్నై నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో వేచిఉన్నారు.
ఘన స్వాగతం: కరుణాస్
దీపావళి పండగ రోజున ముఖ్యమంత్రి అమ్మ జయలలిత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకునే సమయంలో ఘనంగా స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నాడీఎంకే శాసన సభ్యుడు, తమిళ సినీ హాస్య నటుడు కరుణాస్ మీడియాకు చెప్పారు.
ప్రపంచ రికార్డు స్థాయిలో
ముఖ్యమంత్రి జయలలిత డిశ్చార్జ్ అయిన తరువాత అపోలో ఆసుపత్రి నుంచి పోయస్ గార్డెన్ లోని అమ్మ ఇంటి వరకు పెద్ద ఎత్తున్న ఊరేగింపు చేస్తామని అన్నారు. అమ్మ కారు వెనుక వస్తుంటే ముందు పెద్ద సంఖ్యలో ఏనుగులు, గుర్రాలు, దారిపొడవునా బాణాసంచా సిద్దం చేశామని కరుణాస్ అన్నారు. ఈ స్వాగత సంబరాలు ప్రపంచ రికార్డుగా నిలిచిపోగలవని కరుణాస్ వివరించారు.
ఆమె చిక్కింది
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వదంతులు రేపిన ఆరోపణలపై ఫ్రాన్స్ లో నివాసం ఉంటున్న తమిళచ్చిపై (తమిళ యువతి)మీద సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను ఫ్రాన్స్ లో సోమవారం అరెస్టు చేశారని వార్తలు వచ్చాయి. అయితే చెన్నై సైబర్ క్రైం పోలీసులు అధికారికంగా ఇప్పటి వరకు వెల్లడించలేదు.
జయ కోసం ఆలయాల్లో
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం కుదటపడాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. కోయంబత్తూరు పీలమేడులోని కరివరదరాజ పెరుమాళ్ ఆలయంలో మాజీ మంత్రి వేలు స్వామి ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామార్చన చేపట్టారు. పల్లవరంలో 1,008 మంది మహిళలు పాలాభిషేకం చేశారు. చెన్నైలోని టీనగర్ లోని శ్రీచక్ర వినాయక ఆలయంలో పార్టీ నేతలు 108 పాల కలశాలతో ప్రత్యేక పూజలు చేశారు.
నో బెయిల్
సీఎం జయలలిత ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వదంతులు రేపిన నామక్కల్ జిల్లా తిరుచెంగోడుకు చెందిన సతీష్ కుమార్ (24) అనే యువకుడిని ఈనెల 10వ తేదీన అరెస్టు చేశారు. తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని సతీష్ కుమార్ చెన్నైలోని సెషన్స్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. అయితే బెయిల్ ఇవ్వరాదని పోలీసుల తరపు న్యాయవాది అభ్యంతరం చెయ్యడంతో జామీను ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. సతీష్ కుమార్ పుళల్ జైల్లో ఉన్నాడు.