పన్నీర్ సెల్వంకు పదవీ గండం ? ఏం చేద్దాం, కన్నెర్ర చేస్తే !
చెన్నై: తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వంకు పదవి గండం ఉందా ? అంటే ఉందనే అంటున్నారు అన్నాడీఎంకేలోని కొందరు నాయకులు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. అన్నాడీఎంకేలోని కొందరు సీనియర్ మంత్రులు ఇప్పుడు పన్నీర్ సెల్వం సీటుకు ఎసరు పెట్టాలని చూస్తున్నారు.
శశికళకు అన్నాడీఎంకే పగ్గాలు అప్పగించేందుకు దాదాపు ఖాయమైపోయిన నేపథ్యంలో ఇప్పుడు చిన్నమ్మను సీఎం కుర్చిలో కుర్చోపెట్టాలని అన్నాడీఎంకే నాయకులు రంగం సిద్దం చేస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీన జయలలిత మరణించిన సమయంలో అపోలో ఆసుపత్రిలోనే అన్నాడీఎంకే నాయకులు సమావేశం అయ్యారు.
జయలలిత పార్థీవదేహం అక్కడే ఉన్న సమయంలో పక్క గదిలో అన్నాడీఎంకే నాయకులు సమావేశం అయ్యారు. సీఎంగా పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు శశికళకు ఇవ్వాలని అప్పుడే అంగీకారం చేసుకున్నారు.
శశికళకు సినిమా చూపిస్తున్న పన్నీర్ సెల్వం: ఎవరు మీరు?
అదే రోజు అర్దరాత్రి పన్నీర్ సెల్వం సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే శశికళ అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టడానికి సరైన ముహూర్తం కుదరలేదు. శశికళ పార్టీ పగ్గాలు చేపట్టడానికి ఆమెకు సభ్యత్వ కాలం అడ్డుగా ఉంది. దీంతో పార్టీ నిబంధనలు సైతం మార్చడానికి అన్నాడీఎంకే నాయకులు సిద్దం అయ్యారు.
అన్నాడీఎంకే పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ ఆధ్వర్యంలో పార్టీ నిబంధనలు మార్చడానికి ప్రణాళికకూడా రూపొందుతుంది. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి తంబిదురై, ఎడప్పాటి పళనిస్వామి, కేఏ సెంగోట్లయ్యన్ పోటీ పడిని విషయం తెలిసిందే.
జయలలిత తరువాత పార్టీని నడిపించడానికి అన్నాడీఎంకేలో అర్హులు ఎవరూ లేరని వీరే మీడియా ముందు సిగ్గువిడచి చెప్పారు. అలా సీనియర్ నాయకుల మీద చిన్నమ్మ వర్గీయులు ఒత్తిడి చేసి మీడియా ముందు ప్రకటనలు చేయించారు.
జాక్ పాట్: డిసెంబర్ 29 శశికళ డే ? ఎందుకంటే!
శశికళకు పార్టీ పగ్గాలు అప్పగించాలని జిల్లా కార్యవర్గాలు, అన్నాడీఎంకేకి చెందిన పలు సంస్థల చేత తీర్మానాలు చేయించారు. డిసెంబర్ 29వ తేదిన అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. అదే రోజు చిన్నమ్మకు పట్టం కట్టాలని దాదాపు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.
ఇక మిగిలింది సీఎం పీఠం మీద చిన్నమ్మను కుర్చోబెట్టాలని పావులుకదుపుతున్నారు. చిన్నమ్మకు విధేయుడైన సీనియర్ మంత్రి ఉదయ్ కుమార్ దగ్గరుండి ఈ పనులు చూసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నామంత్రి ఉదయ్ కుమార్ మీద సీఎం పన్నీర్ సెల్వం ఎలాంటి చర్యలు ఇంత వరకు తీసుకోలేదు.
అన్నాడీఎంకే పార్టీ పగ్గాలతో పాటు సీఎం కుర్చిలో చిన్నమ్మ కుర్చుంటో జయలలిత ఆత్మశాంతిస్తుందని, అప్పుడే పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ముందుకు వెలుతారని జయలలిత సమాధి సాక్షిగా సీనియర్ మంత్రి ఉదయ్ కుమార్ ప్రకటించారు.
మోడీ మైండ్ గేమ్: బీజేపీ చేతిలో పన్నీర్ జుట్టు, గిరిజ ఎవరో తెలుసా?
అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత శశికళ ఆర్ కే నగర్ నుంచి పోటీ చెయ్యాలా ? వద్దా ? అని ఇప్పుడు నాయకులు అయోమయంలో పడ్డారు. ఆర్ కే నగర్ లో శశికళకు వ్యతిరేకంగా ఇప్పటికే ఫ్లక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చెయ్యడంతో నాయకులు వెనకడుగు వేస్తున్నారు.
శశికళ సామాజిక వర్గం ఎక్కవగా ఉన్న నియోజక వర్గం నుంచి పోటీ చేయించాలని ఆమె అనుచరులు ఆలోచిస్తున్నారు. శశికళ గెలుపుకు సీఎం పన్నీర్ సెల్వం ఎంత వరకు సహకరిస్తారు ? సహకరించరా ? అని చిన్నమ్మ అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ విషయాలను పన్నీర్ సెల్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. పార్టీలో అంతర్గత విభేదాలు ఎంతో కాలం ఉండవని ఆయన అనుచరులు అంటున్నారు. గతంలో రెండు సార్లు సీఎంగా పని చేసిన పన్నీర్ సెల్వం ఇప్పుడు మాత్రం తానే పూర్తి స్థాయి ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారు.
ఈనెల 29వ తేదీ శుక్రవారం సాయంత్రం చెన్నై నగర శివారల్లోని వానగరంలోని శ్రీవారి కల్యాణమండపంలో జరిగే సమావేశంలో పార్టీ కార్యవర్గంలోని 280 మంది సభ్యులు, కార్యవర్గంలోని 2,700 మంది సభ్యులు కచ్చితంగా పాల్గొనాలని పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ ఇప్పటికే మనవి చేశారు.
ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని. ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీ కోశాధికారిగా ఉన్న సీఎం పన్నీర్ సెల్వం ను ఆ పదవి నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే అన్నాడీఎంకే అంతర్గత కలహాలు ఎక్కడికి దారితీస్తాయో అని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.