తమిళనాడులో 48 గంటలు రైలురోకో: స్టాలిన్ అరెస్టు
చెన్నై: కావేరీ జలాలు వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల పాటు రైలురోకో చేపట్టారు. తమిళనాడు శాసన సభలో ప్రతిపక్ష నేత, డీఎంకే కోశాధికారి ఎం.కే. స్టాలిన్ ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.
కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు, కావేరీ కమిటీ సాధన లక్షంగా తమిళనాడు ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వం మీద కన్నెర్ర చేశాయి. సోమవారం నుంచి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల పాటు రైలురోకో నిర్వహించాలని ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి.
స్టాలిన్ అరెస్టు
సోమవారం ఉదయం డీఎంకే నాయకుడు స్టాలిన్, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పెరంబూరు రైల్వే స్టేషన్ దగ్గరకు ర్యాలీగా బయలుదేరారు. రైల్వే స్టేషన్ చేరుకుని రైలు రోకో చెయ్యడానికి విఫలయత్నం చేశారు. పోలీసులు స్టాలిన్ తో పాటు డీఎంకే నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని అరెస్టు చేశారు.
బంద్ కు మద్దతు ఇచ్చిన ప్రతిపక్షాలు
కావేరీ నీటిని వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు రైతు సంఘాలు, వర్తక సంఘాలు 48 గంటలు రైలు రోకోకు పిలుపునిచ్చారు. రైతు సంఘాల రైలురోకో పిలుపుకు ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చాయి.
రాష్ట్ర వ్యాప్తంగా
తమిళనాడులో 48 గంటల పోరు నినాదంతో ఆందోళనలు మొదలైనాయి. ఆందోళనలకు డీఎంకే సంపూర్ణ మద్దతు ఇచ్చింది. డీఎంకేతో పాటు కాంగ్రెస్, తమిళమానిల కాంగ్రెస్, డీఎండీకే, సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే, వీసీకే, వాణిజ్య సంఘాలు మద్దతు ఇచ్చాయి.
అదనపు బలగాలు
48 గంటలు రైలురోకోకు పిలుపునివ్వండంతో చెన్నై నగరంలోని అన్ని రైల్వే స్టేషన్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైల్వే స్టేషన్ల దగ్గర పోలీసు బలగాలు భారీగా మొహరించాయి. ఆందోళనాకారులను అరెస్టు చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
మండిపడిన ప్రతిపక్షాలు
కావేరీ నీటి పంపిణి విషయంలో కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ తమిళనాడు ప్రజలకు ద్రోహం చేస్తున్నదని ఆరోపించారు. మా ఆందోళనలు ఎన్ని రోజులు అడ్డుకుంటారో మేము చూస్తాం అని కేంద్ర ప్రభుత్వం మీద మండిపడ్డారు.
తమిళనాడు ప్రభుత్వం మీద ఆరోపణలు
తమిళనాడు ప్రభుత్వం కావేరీ జలాలు పంపిణి చేసే విషయంలో నిర్లక్షంగా వ్యవహరించిందని, అందుకే కర్ణాటక ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు.
పోలీసుల అదుపులో నేతలు
తమిళనాడులో 48 గంటల రైలురోకో ఆందోళనలకు టీఎన్ సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసు, తిరుమావళవన్, నామ్ తమిళర్ కట్చి పార్టీ వ్యవస్థాపకుడు, సినీనటుడు సీమాన్ తదితరులు మద్దతు ఇచ్చి ఆందోళనలు చేప్టారు. పోలీసులు వీరితో పాటు పార్టీల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
నిఘా పెట్టిన ప్రభుత్వం
కావేరీ జలాల పంపిణి విషయంలో రాజకీయాలు చేస్తున్న వారి మీద తమిళనాడు ప్రభుత్వ పెద్దలు ఓ కన్ను వేసి పెట్టారు. శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చెయ్యాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.