ఆంధ్రా ప్రత్యేక హోదాకు జై: అన్నాడీఎంకే మాజీ ఎంపీ బహిష్కరణ, పళని, పన్నీర్!
చెన్నై: ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వం మద్దతు ఇస్తోందని ఆపార్టీ మాజీ ఎంపీ కేసీ. పళనిస్వామి ప్రకటించిన వెంటనే ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కేసీ పళనిస్వామిని పార్టీ నుంచి బహిష్కరించామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సంయుక్త ప్రకటన విడుదల చేసి షాక్ ఇచ్చారు.

తెలుగుదేశం కరెక్ట్
అన్నాడీఎంకే పార్టీ మాజీ ఎంపీ కేసీ. పళనిస్వామి ఓ ప్రైవేట్ టీవీ చానల్ కు ఇంటర్వూ ఇస్తూ ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మాణం ప్రవేశ పెట్టి మంచి పని చేసిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

తమిళనాడుకు అన్యాయం
కావేరీ నిర్వహణ మండలి ఏర్పాటు చెయ్యడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్షం చేస్తోందని అన్నాడీఎంకే పార్టీ మాజీ ఎంపీ కేసీ. పళణిస్వామి ఆరోపించారు. కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యడంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేసీ పళనిస్వామి విమర్శించారు.

పళని, పన్నీర్ కు షాక్
మాజీ ఎంపీ కేసీ. పళనిస్వామి వ్యాఖ్యలతో కంగుతిన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వెంటనే ఆయన్ను అపార్టీ సభ్యత్వం నుంచి, పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పిస్తూ ప్రకటన విడుదల చేశారు.

బండారం బయటపెడుతా!
తనను పార్టీ నుంచి బహిష్కరించే హక్కు సీఎం ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు లేదని, వారికంటే తాను పార్టీలో సీనియర్ అని, ఇద్దరి అసలు బండారం బయటపెడుతానని మాజీ ఎంపీ కేసీ. పళనిస్వామి హెచ్చరించారు. అన్నాడీఎంకే పార్టీలో చీలకవస్తోందని చెప్పిన కేసీ. పళనిస్వామి కలకలంరేపారు.

ఎంజీఆర్ హయాం
ఎంజీఆర్ హయాం నుంచి కేసీ. పళనిస్వామి అన్నాడీఎంకే పార్టీలో ఉన్నారు. అన్నాడీఎంకే పార్టీలో ఆయన సీనియర్ నాయకుడు. జయలలిత మరణించిన తరువాత అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయిన సమయంలో కేసీ పళనిస్వామి పన్నీర్ సెల్వం వర్గంలో కీలకనేతగా ఉన్నారు.












Click it and Unblock the Notifications