నమ్మక ద్రోహం ? జయలలిత, శశికళ అగ్రిమెంట్ లీక్
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు శశికళ రాజకీయాల్లో రావడం అసలు ఇష్టం లేదని, అందుకే గతంలో జయలలిత నెచ్చెలి శశికళను దూరం పెట్టారని తాజాగా వెలుగు చూసింది.
తండ్రితో సమానం అయిన చో రామస్వామి (తుగ్లక్ పత్రిక వ్యవస్థాపకుడు) దగ్గర జయలలిత 2011లో జరిగిన అసలు రహస్యాలు చో రామస్వామికి చెప్పడంతో ఆ విషయాలు మొత్తం బయటకు వచ్చాయి. 2011లో జయలలిత ముఖ్యమంత్రి అయిన తరువాత పోయెస్ గార్డెన్ లో ఉన్న నెచ్చెలి శశికళ కుటుంబ సభ్యులను బయటకు పంపించేసిన విషయం తెలిసిందే.
తరువాత శశికళ కాళ్ల మీద పడటంతో జయలలిత కొంత కరుణించారు. శశికళను మాత్రం జయలలిత దగ్గరకు తీసుకున్నారు. అయితే శశికళ భర్త నటరాజన్, వారి కుటుంబ సభ్యులను మాత్రం పోయెస్ గార్డెన్ నుంచి మెడపట్టి బయటకు నెట్టేశారు.

అదే సంవత్సరంలో పోయెస్ గార్డెన్ కు వెళ్లిన చో రామస్వామితో జయలలిత అసలు విషయాలు చెప్పారు. తను ఎంతో నమ్మిన శశికళ, ఆమె కుటుంబ సభ్యులు తన అంతం చూడటానికి ప్రయత్నించారని, అందుకే వారిని బయటకు పంపించేశానని జయలలిత చెప్పారంట.
శశికళ తనకు స్నేహితురాలు అయినందున ఆమెను మాత్రం దగ్గరకు తీసుకున్నానని జయలలిత వివరించారంట. శశికళ షరతులు అంగీకరించడంతోనే తాను దగ్గరకు తీసుకున్నానని జయలలిత అసలు విషయం చెప్పారంట.
ఆ షరతులు కూడా జయలలిత చో రామస్వామికి చెప్పారు. శశికళ అగ్రీమెంట్ లో రాసి ఇచ్చిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తాను జీవితంలో ఎప్పుడూ రాజకీయాల జోలికిరానని, తన కుటుంబ సభ్యులను సైతం రాజకీయాలకు దూరంగా పెడుతానని శశికళ అగ్రిమెంట్ రాసి ఇచ్చారంట.

అంతే కాకుండా అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా తాను పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోనని, ఎలాంటి రాజకీయాలు మాట్లాడనని జయలలిత మీద ఒట్టు వేసి అగ్రిమెంట్ రాసి ఇచ్చారని చో రామస్వామికి చెందిన తుగ్లక్ పత్రిక అన్ని విషయాలు బయటపెట్టేసింది.
అందుకే జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జరిగిన మూడు శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో శశికళ ధైర్యం చేసి పోటి చెయ్యలేకపోయారని తుగ్లక్ పత్రిక గుర్తు చేసింది.
జయలలిత మరణించిన తరువాత శశికళ అన్నాడీఎంకే పార్టీ చీఫ్ కావాలని ఆశ పెట్టుకున్నారని, ఇప్పుడు జయలలితకు ఇష్టం లేని పని చేస్తే అన్నాడీఎంకే నాయకులకు చెడ్డపేరు వస్తుందని తుగ్గక్ పత్రిక గుర్తు చేసింది.
శశికళ చేతికి పార్టీ పగ్గాలు వస్తే అది తమిళనాడు ప్రజలకు మంచిది కాదని, రోజురోజుకు పార్టీ పరువు పోతుందని, చివరికి అన్నాడీఎంకే ఏమవుతుందో అని ఆ నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉందని తుగ్లక్ పత్రిక తీవ్రస్థాయిలో హెచ్చరించింది.
ఇప్పటికైనా అన్నాడీఎంకే నాయకులు జయలలిత మాటను గౌరవించి చిన్నమ్మ భజన చెయ్యడం మానుకోవాలని తుగ్గక్ పత్రిక హితవుపలికింది. రాజకీయ నాయకుల అసలు బండారం బయట పెడుతూ వస్తున్న తుగ్లక్ పత్రికకు కొన్ని శతాబ్దాలుగా తమిళనాడులో మంచి గుర్తింపు ఉంది.












Click it and Unblock the Notifications