తమిళ్ నాడు స్పెల్లింగ్ తెలుసా?
తమిళ్ నాడు స్పెల్లింగ్ తెలియకపోవడమేంటీ? ఇదో ప్రశ్నా అని రాగాలు తీస్తున్నారా? పొరపడినట్టే. తమిళ్ నాడు స్పెల్లింగ్ మారబోతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. రేపో, మాపో ఆ ప్రతిపాదనలను ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వ ఆమోదముద్ర పడితే.. ఒక్క తమిళ్ నాడే కాదు.. ఆ రాష్ట్రంలో వాడుకలో ఉన్న సుమారు 7000 పేర్ల స్పెల్లింగులు మారిపోతాయి. ఒక్క దెబ్బతో ఇప్పుడున్న స్పెల్లింగుల్లో కొత్త అక్షరాలు వచ్చి చేరుతాయి. అలాగే- వివిధ ప్రాంతాల ప్రాచీన పేర్లను కూడా పునరుద్ధరించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఉదాహరణకు ట్రిప్లికేన్ అనే ప్రాంతం అసలు పేరు తిరువళ్లిక్కేణి. ఇలాంటి ప్రాంతాలు, వీధులు, గ్రామాల పేర్లను సేకరించి, పాత పేర్లను పునరుద్ధరించడంతో పాటు స్పెల్లింగుల్లో మార్పులు చేర్పులు చేయాలని తమిళ భాషాభిమానులు ప్రతిపాదించారు.
ప్రస్తుతం తమిళ్ నాడును ఇంగ్లీష్ Tamil Nadu అని రాస్తున్నారు. ఇప్పటిదాకా మనకు తెలిసిన స్పెల్లింగ్ ఇదొక్కటే. ఈ అక్షరాల్లో మార్పులు చేర్పులు చేయాలని తమిళ్ నాడుకు చెందిన భాషాభిమానులు ప్రభుత్వానికి విన్నవించారు. ఇంగ్లీష్ లో Tamil Nadu అనే స్పెల్లింగ్ కు బదులుగా, Thamizhnadu అని మార్పు చేయబోతున్నారు. దీనితోపాటు- ఆ రాష్ట్రంలో 18 జిల్లాల్లో ఉన్న వీధులు, కాలనీలు, గ్రామాల పేర్ల స్పెల్లింగుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. తమిళ భాషకు అనుగుణంగా స్పెల్లింగులను కూడా మార్పు చేయాలనేది అక్కడి భాషాభిమానుల పట్టుదలగా కనిపిస్తోంది.
దీనికి సంబంధించి.. తమిళ భాషాభిమానులు పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. స్పెల్లింగులను మార్పు చేయదలిచిన 7000 పేర్లను వారు సేకరించారు. వాటన్నింటిని పొందుపరుస్తూ, తమిళ అభివృద్ధి శాఖ మంత్రి పాండ్యరాజన్ కు ఓ ప్రతిపాదనను అందజేశారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించి, నివేదిక ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలను వేశారు. రాష్ట్రస్థాయి కమిటీకి సంబంధిత శాఖ మంత్రి పాండ్యరాజన్ ను ఛైర్మన్ గా నియమించారు.
తమిళనాడులోని థేని, ఈరోడ్, కృష్ణగిరి, మధురై, కాంచీపురం, కన్యాకుమారి, తిరునెల్వేలి వంటి జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. జిల్లా కేంద్రాల పేర్లతో పాటు, ఆయా జిల్లాల్లో ఉన్న వీధులు, గ్రామాలు, కాలనీల పేర్ల స్పెల్లింగుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. వాడుకలో ఉన్న ఉచ్ఛారణకు అనుగుణంగా స్పెల్లింగులను మార్చుతారు. తమిళులకు భాషాభిమానం అధికం. ఎంత అభిమానం అంటే- జాతీయ భాష హిందీ అంటే వారికి ధ్వేషం. ఆ భాషతో కూడిన పేర్లు ఎక్కడా కనిపించనివ్వరు. రోజువారీ పనుల్లో కూడా హిందీని ఉచ్ఛరించరు. తప్పనిసరి అనుకుంటే తప్ప.. ఆ భాష జోలికి వెళ్లరు.
తెలుగు పట్ల కూడా వారికి ధ్వేషభావం ఉంది. ఇదివరకు రాజధాని చెన్నై సహా హోసూరు వంటి తెలుగు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా తెలుగును బోధించే వారు. ఇప్పుడు అలాంటి పాఠశాలలు పరిమితంగా ఉన్నాయి. తెలుగు బోధించే పాఠశాలలను చాలావరకు మూసేశారు. దీనిపై తమిళనాడులోని తెలుగు భాషా సంఘాలు ఆందోళనలను కూడా చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ ఆందోళనలను పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. అలాగే- కన్నడ భాష అంటే కూడా తమిళులకు పడదు. పట్టదు. కావేరీ నదీ జలాల పంపిణీ వ్యవహారంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న గొడవలే దీనికి కారణం.
మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పేర్ల మార్పు గొడవ పెద్దగా లేదు గానీ.. పొరుగు రాష్ట్రాల్లో మాత్రం పెద్ద ఎత్తున ఉంది. కర్ణాటకలో బెంగళూరు, బళ్లారి నగరాల స్పెల్లింగులో మార్పు చేసిన విషయం తెలిసిందే. బీజాపూర్ ను విజయపురగా, బెల్గామ్ ను బెళగావిగా, గుల్బర్గాను కలబురగిగా మార్పు చేశారు.