స్లీపర్ సెల్స్ ఉన్నారు, పని పడుతారు: దినకరన్
చెన్నై: ఆర్కె నగర్ ఘన విజయంతో జోష్ మీదున్న దినకరన్ తమిళనాడు ప్రభుత్వం మూడు నెలల్లో కుప్పకూలుతుందని అన్నారు. మూడు నెలల్లో ఈపిఎస్ - ఓపిఎస్ ప్రభుత్వం కుప్ప కూలడం ఖాయమని, స్లీపర్ సెల్ సాయంతో ఆ ప్రభుత్వాన్ని కూలుస్తామని అన్నారు.
శానససభలో స్లీపర్ సెల్స్ సాయంతో ప్రభుత్వాన్ని పడగొట్టడం ఖాయమని అన్నారు. విలన్లను (ఈపిఎస్ -ఓపిఎస్) పంపించి వేసి, జయలలిత వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ప్రభుత్వాన్ని స్థాపించడమే తన లక్ష్యమని అన్నారు.

మీడియాతో రెండు సార్లు మాట్లాడాు.
ఆదివారంనాడు దినకరన్ రెండు మార్లు మీడియాతో మాట్లాడారు. ఓసారి ఉదయం ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద, మరోసారి గెలిచిన సర్టిఫికెట్ తీసుకుంటూ సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.

మరో మూడు నెలల్లో పడిపోతుంది..
ప్రస్తుత ప్రభుత్వం మూడు నెలల్లో పడిపోతుందని, ప్రభుత్వంలోని స్లీపర్ సెల్స్ గురించి తాను మొదటి నుంచీ చెబుతూనే వస్తున్నానని దినకరన్ అన్నారు. మంచి వ్యక్తులు నాయకత్వం వహించినప్పుడు మాత్రమే ప్రజలు రెండాకులకు ఓటు వేస్తారని, ఎంజి రామచంద్రన్ సినిమాల్లో ఎంఎన్ నంబియార్, పిఎస్ వీరప్ప పోషించిన విలన్ పాత్రలైన ఈపిఎస్, ఓపిఎస్ చేతుల్లో ఉన్నప్పుడు దానికి ఓటేయరని అన్నారు.

నేనేం ఎక్కువ చేసి చెప్పడం లేదు...
తానేమీ ఎక్కువ చేసి మాట్లాడడం లేదని, ఇంతకు ముందు తాను చేసిన ప్రకటనలను పరిశీలించాలని, భారీ మెజారిటీతో గెలుస్తానని తాను మొదటి నుంచీ చెబుతూ వస్తున్నానని,, మీడియా ప్రతినిధులతో పాటు చాలా మంది తన ప్రకటనలకు నవ్వారని దినకరన్ అన్నారు. చివరగా తానే గెలిచానని, తాను మీడియా మాటలను నమ్మబోనని, ప్రజ నాడి తనకు తెలుసునని, తాను భూమి మీద చెవులు పెట్టి వింటానని ఆయన అన్నారు.

డిఎంకెను ఆయన ఏమీ అనలేదు..
డిఎంకెపై దినకరన్ ఏ విధమైన వ్యాఖ్యలు చేయలేదు. శాసనసభలో బలపరీక్షకు సిద్ధపడాలని కూడా ఆయన డిమాండ్ చేయలేదు. పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు. గుండాల మాదిరిగా ప్రవర్తించవద్దని, ప్రభుత్వానికి పొడగింపుగా వ్యవహరించవద్దని ఆయన పోలీసులను హెచ్చరించారు.












Click it and Unblock the Notifications