తమిళనాడు ప్రభుత్వానికి కేంద్రం అభయం: రాష్ట్రపతి దగ్గరకు పళనిసామి పంచాయితీ !
మైనార్టీలో పడిపోయిన ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని మీరే కాపాడాలని కేంద్ర మంత్రులను తమిళనాడు మంత్రులు, ఎంపీలు వేడుకుంటున్నారు.
న్యూఢిల్లీ: మైనార్టీలో పడిపోయిన ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని మీరే కాపాడాలని కేంద్ర మంత్రులను తమిళనాడు మంత్రులు, ఎంపీలు వేడుకుంటున్నారు. ఎలాగైనా ఎడప్పాడి ప్రభుత్వాన్ని గట్టెక్కించాలని కేంద్ర మంత్రులను అన్నాడీఎంకే పార్టీ నాయకులు మనవి చేస్తున్నారు.
తాడోపేడో తేల్చేయాలని సీఎం పళనిసామి నిర్ణయం, ఎవరు ఉంటారు, ఎవరు పోతారు !
తమిళనాడు మంత్రులు జయకుమార్, తంగమణి, సీవీ షణ్ముగం, పన్నీర్ సెల్వంకు అత్యంత సన్నిహితుడు, ఎంపీ మైత్రేయన్, మాజీ ఎంపీ మనోజ్ పాండియన్ తదితరులు గత మూడు రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేశారు. కేంద్ర మంత్రులు, కేంద్ర హోం శాఖ ప్రధాన కార్యదర్శిని కలిశారు.
అభయం ఇచ్చిన కేంద్రం
కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి తమిళనాడులో ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని కాపాడాలని ఆరాష్ట్ర మంత్రులు మనవి చేశారు. కేంద్ర మంత్రులు ఎడప్పాడి ప్రభుత్వాన్ని కాపాడుతామని అభయం ఇచ్చారని తెలిసింది.
రాష్ట్రపతి దగ్గరకు స్టాలిన్
తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు ఎంకే. స్టాలిన్ గురువారం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించాలని మనవి చెయ్యడానికి ఢిల్లీ వెళ్లారు.
ఢిల్లీకి చెక్కెసిన సెంగోట్టియన్
స్టాలిన్ రాష్ట్రపతిని కలవడానికి బయలుదేరారని తెలుసుకున్న తమిళనాడు మంత్రి సెంగోట్టియన్ గురువారం ఢిల్లీకి చెక్కెశారు. కేంద్ర మంత్రులతో చర్చలు జరపడానికి సెంగోట్టియన్ ఢిల్లీ వెళ్లారని ఎడప్పాడి పళనిసామి వర్గీయలు అంటున్నారు.
రెండాకుల చిహ్నం కోసం
అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం దక్కించుకోవడానికి తమిళనాడు మంత్రులు ఢిల్లీ వెళ్లారు. వెళ్లిన పని పక్కన పెట్టిన తమిళనాడు మంత్రులు తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కేంద్ర మంత్రుల చుట్టూ తిరుగుతున్నారని తమిళనాడులోని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
శశికళను తప్పించాలి
అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళను నియమించామని గతంలో ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన అఫిడవిట్లు వెనక్కి తీసుకోవాలని ప్రయత్నిస్తున్న లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, ఎంపీ మైత్రేయన్ ఆ విషయం పక్కన పెట్టి కేంద్ర హోం శాఖ ప్రధాన కార్యదర్శిని కలిసి తమిళనాడు ప్రభుత్వాన్ని కాపాడాలని మనవి చేశారు.