తమిళనాడుకు డిసెంబర్ గండం: ఎంజీఆర్, జయ, సునామి ఇంకా !
చెన్నై: డిసెంబర్ నెల అంటేనే తమిళనాడు ప్రజలు పెద్ద గండం వచ్చిపడుతుందని భావిస్తున్నారు. అందుకు కారణం అదే నెలలలో తమిళనాడుకు చెందిన అనేక మంది ప్రముఖులు మరణించారు.
ప్రకృతి వైపరిత్యాల కారణంతో సునామి సైతం అదే నెలలో వచ్చి తమిళనాడును అతలాకుతలం చేసింది. డిసెంబర్ నెలలలో తమిళనాడులో లెక్కలేనన్ని విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. యాదృచ్చికమో ఏమో కాని డిసెంబర్ నెలలలో మహానేతలను తమిళనాడు కోల్పోయింది.
తమిళనాడు ప్రజల దగ్గర ఆప్యాయంగా అమ్మా అని పిలుపించుకునే జయలలిత సైతం అదే నెలలో అస్తమయం కావడంతో ఆ సెంటిమెంట్ మళ్లీ పునరావృతం అయ్యిదని తమిళ ప్రజలు అంటున్నారు.
తమిళ ప్రజలు అమ్మా అంటూ దేవతలా ఆరాధించే జయలలిత డిసెంబర్ 5వ తేదిన ఉదయం 11.30 గంటలకు మరణించారని అదే రోజు అర్దరాత్రి 12.10 గంటలకు అధికారికంగా ప్రకటించారు. జయలలిత గురువు, అలనాటి తమిళ సూపర్ స్టార్ ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) సైతం డిసెంబర్ నెలలోనే మరణించారు.
1987 డిసెంబర్ 24వ తేదిన చికిత్స విఫలమై అపోలో ఆసుపత్రిలో ఎంజీఆర్ తుది శ్వాస విడిచారు. సినీ రంగంతో పాటు రాజకీయంగాను గురువుగా భావించే జయలలిత అదే నెలలలో ఎంజీఆర్ దగ్గరకు వెళ్లిపోయారు. తమిళనాడు ప్రజలు గురువుగా భావించే పెరియార్ రామస్వామి ఇదే డిసెంబర్ నెలలో మరణించారు.
1972 డిసెంబర్ 24వ తేదిన పెరియార్ ఈవీ. రామస్వామి, భారత చివరి గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి 1972 డిసెంబర్ 25వ తేది (ఒక్క రోజు తేడా) తుది శ్వాస విడిచారు. ఇలాంటి మహానుభావులు డిసెంబర్ నెలలోనే తమిళ ప్రజలకు దూరం అయ్యారు.
ఇక ప్రకృతి వైపరిత్యాల కారణంగా తమిళ ప్రజలు అల్లాడిపోయింది కూడా ఇదే డిసెంబర్ నెలలోనే. 2004 డిసెంబర్ 26 తేదిన సునామి రావడంతో 8 వేల మందికి పైగా ప్రాణాలు పోవడంతో తమిళ ప్రజలు హడలిపోయారు. 2015 డిసెంబర్ నెలలో చెన్నై నగరాన్ని వరదలు ముంచెత్తాయి.
ఈ ప్రకృతి వైపరిత్యాల కారణంగా అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. డిసెంబర్ నెలలో ఇలాంటి అపశకునాలు ఇంకా ఎన్ని ఎదురౌతాయో ? ఎలాంటి అశుభవార్తలు వినాల్సి వస్తుందో అంటూ తమిళ ప్రజలు హడలిపోతున్నారు. దాదాపుగా తమిళనాడు ప్రజలు డిసెంబర్ నెలను ఓ గండంలా భావిస్తున్నారు.