జయ ఆరోగ్యంపై పుకార్లు: బ్యాంకు ఉద్యోగులు అరెస్టు
చైన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మీద పుకార్లు సృష్టించి తమాషా చూసిన ఇద్దరు బ్యాంకు ఉద్యోగులను చెన్నై నగర క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. కోయంబత్తూరుకు చెందిన సురేష్, రమేష్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు.
సురేష్, రమేష్ తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై పుకార్లు సృష్టించి ప్రజలను ఆందోళనకు గురి చేశారు. విషయం తెలుసుకున్న అన్నాడీఎంకే నాయకురాలు పునీత చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు.
కోయంబత్తూరులోని కెనరా బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న సురేష్, రమేష్ అనే ఇద్దరు జయలలిత ఆరోగ్యంపై పుకార్లు సృష్టించి తమాషా చూశారని గుర్తించారు. శుక్రవారం కోయంబత్తూరులో ఇద్దరిని అరెస్టు చేశారు.
ఇప్పటికే జయలలిత ఆరోగ్యం మీద పుకార్లు సృష్టించారని 53 ఫిర్యాదులు చేశారు. అధికారికంగా 43 కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడుతో సహ వివిధ ప్రాంతాల్లో ఉన్న వారు జయలలిత ఆరోగ్యం విషయంపై పై పుకార్లు సృష్టించారని చెన్నై నగర క్రైం బ్రాంచ్ పోలీసులు గుర్తించారు.