Oneindia Exclusive: తమిళనాట ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ రద్దయ్యే ఛాన్స్..?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. ప్రచారం ముగిసే సమయానికి ప్రధాన పార్టీల మధ్య పోటీ 'ఓట్ల' నుంచి 'నోట్ల' స్థాయికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున నగదు పంపిణీ జరుగుతుందనే ఆరోపణల నేపథ్యంలో, ఎన్నికల సంఘం (EC) అత్యంత కఠినమైన చర్యలకు సిద్ధమవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, నగదు ప్రవాహం అదుపు తప్పిన నియోజకవర్గాల్లో పోలింగ్ను రద్దు చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలోని డీఎంకే, అన్నాడీఎంకే వంటి ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు భారీగా వ్యయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సామాన్య నియోజకవర్గాల్లో ఒక్కో ఓటుకు రూ. 1,000 నుంచి రూ. 2,000 వరకు పంపిణీ జరుగుతుండగా.. వీఐపీ అభ్యర్థులు బరిలో ఉన్న చోట్ల ఈ ధర ఏకంగా రూ. 5,000 మార్కును దాటేసింది. ఇప్పటికే మొదటి విడత పంపిణీ పూర్తయిందని, ఏప్రిల్ 21వ తేదీ రాత్రి స్వతంత్ర బృందాల ద్వారా చివరి విడత 'ఆపరేషన్ క్యాష్'ను అమలు చేసేందుకు పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

రాడార్లో 15 కీలక నియోజకవర్గాలు..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 15కు పైగా నియోజకవర్గాలు ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యక్ష నిఘాలో ఉన్నాయి. ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఐటీ అధికారులు నిరంతరం దాడులు నిర్వహిస్తూ ఆధారాలను సేకరిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన హేమాహేమీలు పోటీ పడుతున్న స్థానాల్లో నగదు ప్రవాహాన్ని అడ్డుకోవడం అధికారులకు సవాలుగా మారింది. సేకరించిన ఆధారాలను క్రోడీకరించి, ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి నివేదించాలని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నివేదికల ఆధారంగానే ఎన్నికల నిర్వహణపై ఈసీ తుది నిర్ణయం తీసుకోనుంది.
ఢిల్లీ నివేదికపైనే సర్వత్రా ఉత్కంఠ!
గతంలో కూడా తమిళనాడులో నగదు పంపిణీ కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికలు వాయిదా పడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి పునరావృతమయ్యేలా కనిపిస్తోంది. భారీ ఎత్తున నగదు పంపిణీ జరిగినట్లు నిరూపితమైతే, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు సదరు నియోజకవర్గాల్లో పోలింగ్ను రద్దు చేయడం ఒక్కటే మార్గమని ఎన్నికల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్కు ముందు చివరి రెండు రోజులు అత్యంత కీలకం కానున్న నేపథ్యంలో, అదనపు బలగాలతో నిఘాను మరింత ముమ్మరం చేశారు. మొత్తానికి, తమిళనాడులో 'ప్రజాస్వామ్యం' గెలుస్తుందా లేక 'ధనస్వామ్యం' రాజ్యమేలుతుందా అన్నది ఈసీ తీసుకునే కఠిన నిర్ణయాలపైనే ఆధారపడి ఉంది.












Click it and Unblock the Notifications