ఒంటరి పోటీ: పిఎం పదవిపై కన్నేసిన జయలలిత?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడియంకె అధినేత జయలలిత ప్రధాన మంత్రి పదవిపై కన్నేసినట్లు కనిపిస్తున్నారు. ఆ కారణంగానే బిజెపితో ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోవడానికి ఆమె సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ జయలలితతో ఎన్నికల ముందు పెట్టుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నప్పటికీ ఆమె ముందుకు రావడం లేదని అంటున్నారు.
వచ్చే లోకసభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, రాష్ట్రంలో 40 పార్లమెంటు స్థానాలను తమ పార్టీ గెలుస్తుందని, దేశ భవిష్యత్తు రాజకీయాలను తమ పార్టీ శాసిస్తుందని ఆమె అంటున్నారు. దీన్నిబట్టి ఆమె తమిళనాడులో మెజారిటీ లోకసభ స్థానాలను గెలుచుకోవడం ద్వారా ప్రధాని పదవికి పోటీ పడాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు.
బిజెపితో ముందే పెట్టుకుంటే ప్రధాని పదవికి నరేంద్ర మోడీ అభ్యర్థిత్వాన్ని అంగీకరించినట్లవుతుంది. అందుకే ఆమె బిజెపికి ఏ విధమైన హామీ ఇవ్వడం లేదని అంటున్నారు. ప్రధాని కావడానికి జయలలితకు అవకాశాలున్నాయని మాజీ ప్రధాని, జెడి (ఎస్) నేత దేవెగౌడ ఇటీవల అన్నారు. ఆయన మాటలు జయలలితలో మరింతగా ఆశలు పెంచినట్లు చెబుతున్నారు.
జయలలిత ఆ మధ్య కాస్తా తృతీయ కూటమివైపు మొగ్గు చూపినట్లు కనిపించినప్పటికీ దాంతో కలిసి నడవడానికి సిద్ధపడలేదు. అసలు తృతీయ కూటమి అనేది పురిటి దశలోనే ఉంది. కాంగ్రెసు, బిజెపిలకు వ్యతిరేకంగా తృతీయ కూటమిని ఏర్పాటు చేయాలని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ తీవ్రంగానే ప్రయత్నాలు సాగించారు. ఆయన కూడా ప్రధాని పదవిపై ఆశపడుతున్నట్లు కనిపిస్తున్నారు.
ఎన్నికల తర్వాత ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందనే దానిపై కేంద్రంలో రాజకీయ సమీకరణాలు మారుతాయని అంటున్నారు. ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రధాన పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. ఆ అవకాశాలను వాడుకుని ప్రధాని పదవిని చేపట్టాలని ఆశపడుతున్న నాయకులు చాలా మందే ఉన్నారు. ఆ జాబితాలో జయలలిత కూడా ఉన్నట్లు తెలుస్తోంది.