బిగ్ షాక్.. ఎన్నికల వేళ భారీ బ్లాస్ట్.. 17 మంది మృతి.. 9 మందికి సీరియస్
తమిళనాడులోని ఓ బాణసంచా కార్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆ ఫ్యాక్టరీలో పని చేస్తున్న 30 మందికి పైగా సిబ్బందిలో 17 మంది మృతి చెందారు. మరో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా మారింది. రాష్ట్రంలోని విరుధునగర్ జిల్లా కట్టనార్ పట్టి గ్రామంలో ఏప్రిల్ 19 ఆదివారం రోజున ఈ ఘటన జరిగింది. పేలుడు జరిగిన విషయం తెలిసిన వెంటనే ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
తమిళనాడులోని విరుధు నగర్ జిల్లా కట్టనార్ పట్టి గ్రామంలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు భారీ పేలుడు సంభవించింది. టపాసులు పేలడంతో ఒక్కసారిగా ఫ్యాక్టరీ మొత్తానికి మంటలు వ్యాపించాయి. దీంతో కర్మాగారంలోని 17 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. మరో 9 మంది తీవ్రంగా గాయాలైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు.
VIDEO | Virudhunagar, Tamil Nadu: Several feared dead in a firecracker factory blast near Kattanarpatti. pic.twitter.com/FLJBiukUtG
— Press Trust of India (@PTI_News) April 19, 2026
సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్న సమయంలో సిబ్బంది ఫైర్ క్రాకర్స్ ను ఓ చోట పేర్చుతుండగా పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆ బిల్డింగ్ కూడా పాక్షికంగా దెబ్బతింది. ఈ బాణసంచా ఫ్యాక్టరీ గోవిందనల్లూర్ కు చెందిన ముత్తు మానికమ్ అనే వ్యక్తికి సంబంధించినదిగా తేలింది. పేలుడు ధాటికి అక్కడి పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అంతేకాక ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళన నెలకొంది. క్షతగాత్రులను ప్రస్తుతం విరుధునగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక ఇదే ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని సూచించారు. మరోవైపు తమిళనాడులో మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారీ పేలుడు ఘటన ప్రజలను భయభ్రాంతులను చేసింది.












Click it and Unblock the Notifications