తమిళనాడులో ఏం జరుగుతోంది, బిజెపి వ్యూహాత్మక అడుగులు, రాజ్ నాథ్, విద్యాసాగర్ రావు ల కీలకబేటీ
తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు శుక్రవారం నాడు న్యూడిల్లీలో కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ :జయలలిత మరణం తర్వాత చోటుచేసుకొన్న పరిణామాలపై కేంద్రం ఆరా తీస్తోంది. రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు న్యూడిల్లీ వెళ్ళారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆయన కేంద్రానికి వివరించారు. జయ మరణం తర్వాత న్యూఢిల్లీకి వెళ్ళడం విద్యాసాగర్ రావు ఇదే ప్రథమం. ఢిల్లీ పెద్దలతో గవర్నర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.
పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి గా అర్థరాత్రి ఎందుకు ప్రమాణం చేశాడు
జయలలిత మరణించడానికి ముందుగానే పన్నీరు సెల్వం అర్థరాత్రే ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టడానికి వ్యూహత్మకంగా వ్యవహారించడమే కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అన్నాడిఎంకె పగ్గాలు శశికళ చేతిలో ఉన్నాయి. ముఖ్యమంత్రిగా శశికళ పీఠాన్ని అధిరోహిస్తారనే ప్రచారం కూడ ఉంది. అయితే పరిణామాలు మాత్రం సెల్వం కు అనుకూలంగా మారడంతో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..అయితే ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించిన తర్వాత పన్నీరు సెల్వం కొందరు సీనియర్ మంత్రులంతా శశికళతో జయ నివాసంలో సమావేశమయ్యారు.ముఖ్యమంత్రిగా సెల్వం ఉన్నా చక్రం తిప్పుతోంది మాత్రం శశికళే అని ఎనలిస్టులు అభిప్రాయంతో ఉన్నారు.
గవర్నర్ కేంద్ర హోంమంత్రితో సమావేశం
సాధారణంగా ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్లు కేంద్రానికి నివేదికలను పంపుతుంటారు. ఈ నివేదికలను ఇచ్చేందుకు గవర్నర్లు తరచూ డిల్లీకి వెళ్తుంటారు. ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఎప్పటికప్పుడు కేంద్ర హోంమంత్రిత్వశాఖకు అందిస్తుంటారు.అయితే శుక్రవారం నాడు తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు శుక్రవారం నాడు డిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకొంది.రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆయన కేంద్రానికి తన నివేదికను ఇచ్చారు. కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఆయన సమావేశమై తాజా పరిస్థితులను వివరించారు.
బిజెపి వ్యూహాత్మక అడుగులు
తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బిజెపి వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది.దక్షిణాది పాగా వేసేందుకు చాలకాలంగా ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. అయితే కర్ణాటక రాష్ట్రంలో ఆ పార్టీకి కొంత అవకాశాలు కలిసివచ్చాయి.అయితే ఆ పార్టీ నాయకులు చేసిన పొరపాట్ల కారణంగా కర్ణాటకలో ఆ పార్టీ నష్టపోయింది. తమిళనాడు లో పాగా వేయాలని బిజెపి ప్రయత్నిస్తోంది. అయితే అన్నాడిఎంకె ను ఒంటిచేత్తో నడిపిన జయలలిత లేకపోవడం ఆ పార్టీకి పెద్ద నష్టమే.అయితే అధికార అన్నా డిఎంకెకు విపక్ష డిఎంకె కాంగ్రెస్ కూటమికి మధ్య కేవలం 20 మంది ఎంఏల్ఏలు మాత్రమే తేడా ఉంది. దరిమిలా బిజెపి ఆచితూచి అడుగులు వేస్తోంది.రాష్ట్రంలో చోటుచేసుకొంటున్న రాజకీయపరిణామాలను ఆ పార్టీ నిశితంగా పరిశీలిస్తోంది. ఆచితూచి ఆ పార్టీ అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో తమ పార్టీ బలపడేందుకు అవసరమైన వ్యూహాన్ని రచిస్తోంది బిజెపి.
అన్నాడిఎంకెను సమర్థవంతంగా నడిపేది ఎవరు
ఎంజిఆర్ చనిపోయిన తర్వాత జయలలిత, జానకీ రామచంద్రన్ వర్గ్గాలుగా అన్నాడిఎంకె పార్టీ చీలిపోయింది.అయితే జానకీ రామచంద్రన్ ఎక్కువ కాలం పార్టీని నడిపించలేకపోయారు. తదనంతరం చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో జయలలిత నేతృత్వంలోనే జానకీ రామచంద్రన్ వర్గం కూడ విలీనమైంది. తానే పార్టీయై నడిపించింది జయ.కొందరు పార్టీని చీల్చేందుకు ప్రయత్నిస్తే వారికి టిక్కెట్టు దక్కకుండా చేశారు. ఆమె బతికున్నంత కాలం పార్టీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు.అయితే ఆమె మరణించడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. జయ తరహాలో పార్టీని నడిపించే నాయకులు ఎవరున్నారనేది చర్చనీయాంశమైంది. ప్రస్తుతం శశికళ కనుసన్నల్లోనే పార్టీ నడుస్తోంది. భవిష్యత్తులో ఇదే విధానం ఉంటుందా, లేదా అనేది ఆసక్తి నెలకొంది.