మీరెందుకు వీరప్పన్ను చంపారు: శేషాచలం ఎన్కౌంటర్పై టిడిపి నేత
చెన్నై: శేషాచలం అడవుల్లో 20 మందిని చంపడం తప్పయితే తమిళనాడు ప్రభుత్వం వీరప్పన్ను చంపడం కూడా తప్పే అవుతుందని తెలుగుదేశం పార్టీ నేత అన్నా రామచంద్రయ్య తమిళనాడు ఆందోళనకారుల వద్ద వాదించారు. శేషాచలం అడవుల్లో 20 మందిని పోలీసులు మట్టబెట్టడంపై తమిళనాడులో ఆందోళనలు పెల్లుబుకుతున్న విషయం తెలిసిందే.
తమిళనాడు ప్రభుత్వం వీరప్పన్ను చంపిందని, శ్రీగంధం కాపాడుకునేందకనే కదా అని, మరిక్కడ జరిగిందీ అదేనని, శేషాచలంలో ఎర్రచందనం పరిరక్షణకు టాస్క్ఫోర్సు అధికారులు చర్యలు చేపట్టారని ఆయన వివరించారు. తమపై దాడి చేయబోయే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారని, ఇది తప్పంటే.. వీరప్పన్ను చంపడమూ తప్పే అవుతుందని ఆయన అన్నారు.
ఎర్రచందనం చెట్లు నరికేందుకు అడవిలోకి వస్తే చంపేస్తామని 9 నెలల కిందటే తమిళనాడంతా హెచ్చరికలు చేశారని ఆయన గుర్తుచేశారు. అయినా వారు రావడం మానలేదని, అడ్డుకునే పోలీసులపై తిరగబడ్డారని చెప్పారు. ఇలా దాడికి దిగినా తుపాకీలను గురిపెట్టద్దంటే.. ఇక ఆయుధాలు ఇచ్చింది ఎందుకని అడిగారు. రుయాస్పత్రి వద్ద బూటకపు ఎన్కౌంటర్ చేశారంటూ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు విమర్శలు చేస్తుండటాన్ని ఆయన తప్పుబడుతూ మాట్లాడారు.
‘శ్రీగంధం కాపాడేందుకు తమిళనాడులో ఎన్కౌంటర్ చేస్తే ఒప్పు.. ఇక్కడ చేస్తే తప్పా..? ఇదెక్కడి న్యాయమో అక్కడి ప్రజలే చెప్పాలి' అని అన్నారు. అక్రమార్కులను కట్టడి చేసేందుకు చట్టాలు ఉన్నట్లయితే వీరప్పన్, ఆయన అనుచరులను వేటాడి ఎందుకు చంపారో కూడా చెప్పాలని రామచంద్రయ్య నిలదీశారు. అక్కడ ఆందోళనలు చేసేవారికి ఇక్కడి రాజకీయ నేతలు వత్తాసు పలకడం అన్యాయమన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్మగ్లర్లను ప్రోత్సహించిందని, ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి వచ్చి అక్రమార్కులను కట్టడి చేస్తుంటే రాజకీయ లబ్ధికోసం విమర్శలు చేయడం సబబు కాదన్నారు.