టీ స్టాల్స్ ఫుట్పాత్ పార్లమెంట్స్: మోడీ చాయ్ పే చర్చ
అహ్మదాబాద్: చాయ్ దుకాణాలు ఫుట్పాత్ పార్లమెంటులని గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. ఆయన బుధవారం చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చాయ్ చప్పరిస్తూ ఆయన ఈ చర్చను ప్రారంభించారు. దేశంలోని 300 పట్టణాల్లో వేయి టీ దుకాణాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ ప్రజలందరికీ చాయ్ బంధువు అని, అది అత్యంత ప్రీతిపాత్రమైందని ఆయన అన్నారు. డిల్లీ నుంచి గల్లీ వరకు చాయ్ దుకాణాల్లో అన్ని విషయాలపై చర్చ జరుగుతుందని ఆయన అన్నారు. చాయ్ తాగుతూ పల్లె నుంచి ప్రపంచ వార్తల వరకు అన్ని విషయాల గురించి చర్చించుకుంటామని ఆయన అన్నారు.

మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామని, చక్రవర్తి అశోకుడు నడిపించినట్లుగా ఈ రోజు పాలనను సాగించలేమని, ఆరోగ్యకరమైన సమాజం కాలాన్ని బట్టి మారుతుందని, సరైన విషయాలను నేర్చుకోవాలని ఆయన ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.
ఎన్నికల్లో విజయం సాధించాలని అనుకునేవారు చాలా శ్రమించాల్సి ఉంటుందని, రాజకీయాల్లో చాలా మార్పులు సంభవించాయని ఆయన అన్నారు. చెడు పరిపాలన డయాబెటిస్ లాంటిదని, అవినీతి తదితర విషయాలు దాంతో కలిసి ఉంటాయని ఆయన అన్నారు. సుపరిపాలన గురించి చాలా వింటున్నామని, అయితే దాని అసలు అర్థం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని మోడీ అన్నారు. గాంధీ మనకు స్వరాజ్యం ఇచ్చారని, కానీ మనం సురాజ్యంగా మార్చలేకపోయామని అన్నారు.












Click it and Unblock the Notifications