ఫేస్బుక్లో పరిచయమై యువతిని కిడ్నాప్ చేశారు
పనాజీ: సోషల్ మీడియాతో కొంత మేలు జరుగుతున్నప్పటికీ.. కొన్ని అనర్థాలకు కూడా దారితీస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే గోవాలో చోటు చేసుకుంది. ఫేస్బుక్లో స్నేహితుల్లా పరిచయమైన ఇద్దరు యువకులు ఓ యువతిని కిడ్నాప్ చేశారు.
ఈ ఘటన గోవా రాష్ట్రం పనాజీ సమీపంలోని పోర్వారిమ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోర్వారిమ్ ప్రాంతానికి చెందిన 16ఏళ్ల యువతిని ఇద్దరు యువకులు ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యారు.
కాగా, వారు ఆమెను కలవడానికి యువతి ఇంటి వద్దకు వచ్చి.. అదను చూసి ఆమెను కిడ్నాప్ చేశారు. బయటకు వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాకపోవడంతో.. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతి కిడ్నాప్ అయిన మూడు గంటల్లో ఆమెను కనిపెట్టగలిగారు. అనంతరం ఆమెను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
కిడ్నాప్ చేసిన ఇద్దరు యువకుల్లో ఒకరు మైనర్ అని పోలీసులు చెప్పారు. నిందితుల్లో మేజర్ అయిన యువకుడిని జైలుకు తరలించగా, మైనర్ బాలుడిని బాల నేరస్థుల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు తెలిపారు.