నరేంద్రమోడీకి గ్రాండ్గా వెల్కమ్ చెప్పిన కేసీఆర్?
భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఈసారి ఎటువంటి పరిస్థితుల్లోను కమలం జెండా రెపరెపలాడించాలన్న పట్టుదలతో ఉన్న పార్టీ పెద్దలు జాతీయ కార్యవర్గ సమావేశాలకు వేదికగా హైదరాబాద్ను ఎంచుకున్నారు. నగరమంతా ఫ్లెక్సీలతో నింపేశారు. అయితే వీరికి పోటీగా టీఆర్ఎస్ కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీగా ఫ్లెక్సీల పోరు నడుస్తోన్న సంగతి తెలిసిందే.
భారీగా జరిమానా విధించిన జీహెచ్ఎంసీ
నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినందుకు హైదరాబాద్ నగరపాలక సంస్థ బీజేపీకి రూ.20 లక్షలు, టీఆర్ఎస్కు రూ.3 లక్షలు జరిమానా వేసి వాటిని తొలగిస్తూ వస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ హైదరాబాద్ నగరానికి వస్తున్న బీజేపీ నేతలు ప్రయాణించే మార్గాల్లోనే టీఆర్ఎస్ వీటిని ఏర్పాటు చేసింది. ఆ ఫ్లెక్సీలన్నీ తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఖ్యాతిని, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సాధించిన విజయాలను పేర్కొంది. కచ్చితంగా ఇవన్నీ బీజేపీ నేతల దృష్టిలో పడేవే. వాటిని చూడకుండా కార్యవర్గ సమావేశాలు జరిగే వేదిక దగ్గరకు వెళ్లడం మాత్రం సాధ్యం కాదు.
బీజేపీ నేతలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునేలా..
దేశం నలువైపుల నుంచి టీఆర్ఎస్ను విమర్శించేందుకు హైదరాబాద్ వస్తున్న నేతలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునేలా కేసీఆర్ అమలు చేస్తున్న వ్యూహం అద్భుతమని ఆ పార్టీ నేతలు కొనియాడుతున్నారు. కేసీఆర్ ఫొటోలతో, వివిధ రంగాల్లో తెలంగాణ ఎలా అభివృద్ధి చెందిందో వివరాలన్నీ తెలియజేస్తూ దారిపొడవునా ఈ బ్యానర్లను ఏర్పాటు చేశారు. అవన్నీ వాస్తవాలే కావడంతో ఎవరూ కాదనలేని పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది.
ఐటీ రంగంలో అగ్రగామి
ప్రపంచంలోకెల్లా అతి పెద్ద స్టార్టప్, ఇన్నోవేషన్ కేంద్రం టీహబ్ను హైదరాబాద్ కలిగివుండటం, దేశానికి సంబంధించే కాకుండా ప్రపంచంలోనే ఐటీ రంగంలో అగ్రగామిగా హైదరాబాద్ నగరం ఎదుగుతున్న తీరు, ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్ర ప్రగతి, తలసరి విద్యుత్తు వినియోగంలో, రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందించడంలో, అత్యధిక వృద్ధిరేటు సాధించిన రాష్ట్రంగా తెలంగాణ, దేశ ప్రజారోగ్య రంగంలో మొదటిస్థానంలో ఉండటంలాంటివన్నింటినీ ఈ బ్యానర్లలో వివరించింది. ఇవన్నీ వాస్తవాలే కావడంతో బీజేపీ నేతల నుంచి ఎటువంటి విమర్శలు రావడంలేదని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు.