టీపై వడిగా: నవంబర్ 5లోగా నివేదికలకు ఆదేశం
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వడివడిగా కొనసాగిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజనపై నవంబర్ 5వ తేదీలోగా నివేదికలు సమర్పించాలని కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర విభజనపై శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శుల సమావేశం జరిగింది. తొమ్మిది మంత్రిత్వ శాఖల కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఆర్థిక, ప్రణాళికా సంఘం, న్యాయ, హోం, పాలనా సిబ్బంది, విద్యుత్తు, బొగ్గు, నీటిపారుదల శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా జలవరులు, సహజ వనరులపై పంపిణీపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులవారీగా ఆయకట్టు వివరాలను ఇవ్వాలని హోంశాఖ నీటి పారుదల శాఖను కోరింది. ఆర్థిక వనరులు, ఆదాయ వ్యయాలు, ఆర్థిక పరిస్థితిపై కూడా చర్చించారు.
రాష్ట్రంలో పరిస్థితిపై హోంశాఖకు ఆయా శాఖల అధికారులు సంక్షిప్తంగా సమాచారం అందించారు. దాంతో ఈ నెల 5వ తేదీలోగా పూర్తి స్థాయి నివేదికలు సమర్పించాలని హోంశాఖ ముఖ్య కార్యదర్సి ఆయా శాఖల కార్యదర్శులను ఆదేశించారు. దీంతో ఆయా శాఖల కార్యదర్శులు రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి సమాచారాన్ని రాబట్టి నివేదికలు రూపొందించే అవకాశం ఉంది. దీన్నిబట్టి బిల్లులో ఎలాంటి విధానపరమైన అంశాలను ఉంచాలనే విషయంపై కేంద్రం దృష్టి సారించిందని అర్థమవుతోంది.
సీమాంధ్రకు ఏ విధమైన ప్యాకేజీలు ఇవ్వాలనే విషయంపై తుది నిర్ణయం కేంద్ర మంత్రుల బృందం తీసుకుంటుంది. కాగా, శీతాకాలం పార్లమెంటు సమావేశాల లోగానే జివోఎం నివేదిక రూపొందిస్తుందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఇప్పటికే చెప్పారు. జీవోఎం మరోసారి వచ్చే నెల 7వ తేదీన సమావేశం కానుంది. ఐదో తేదీలోగా వివిధ శాఖల నుంచి వచ్చిన నివేదికలపై జివోఎంలో చర్చ జరిగే అవకాశం ఉంది.