తెలంగాణ నోట్ ఆలస్యమే: షిండే వద్ద పెండింగ్
న్యూఢిల్లీ: తెలంగాణ నోట్ రేపటి (బుధవారంనాటి) మంత్రి వర్గ సమావేశం ముందుకు రాబోవడం లేదని సమాచారం. ఈ మేరకు మంగళవారం పిటిఐ ఓ వార్తాకథనాన్ని ఇచ్చింది. తెలంగాణ కేబినెట్ నోట్ ముసాయిదాకు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఇంకా తుది రూపం ఇవ్వలేదని సమాచారం. దానికి రాజకీయ ఆమోదం లభించలేదని పిటిఐ వార్తాకథనం సారాంశం.
తెలంగాణ నోట్ ముసాయిదాకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తుది రూపం ఇవ్వలేదని అంటున్నారు. ఆంటోనీ కమిటీ నివేదిక లభించిన తర్వాతనే నోట్కు తుది రూపం ఇస్తారని అంటున్నారు. దాంతో రేపు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు జరిగే మంత్రి వర్గ సమావేశం ముందుకు తెలంగాణ నోట్ రాబోదని అంటున్నారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోట్కు తుది రూపం ఇచ్చిన తర్వాత యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీకి, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు వెళ్తుందని, వారు ఆమోదం తెలిపిన తర్వాత న్యాయశాఖకు పంపిస్తారని, న్యాయశాఖ ఆమోదం తెలిపిన తర్వాత అది మంత్రివర్గం ముందుకు వస్తుందని అంటున్నారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలపై ఆంటోనీ కమిటీ కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఆ అభిప్రాయాలతో నివేదిక రూపొందించి సోనియాకు సమర్పించాల్సి ఉంది.
ఆంటోనీ అస్వస్థతకు గురి కావడంతో నివేదికను సమర్పించడంలో జాప్యం జరుగుతోందని అంటున్నారు. అయితే, తమ రాజీనామాల హెచ్చరికల వల్లనే తెలంగాణ నోట్ ఆగిపోయిందని సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు అంటున్నారు. కాగా, సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి జెడి శీలం మంగళవారం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్తో సమావేశమయ్యారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన రాష్ట్ర పరిస్థితులను కాంగ్రెసు అధిష్టానం పెద్దలకు వివరించే అవకాశం ఉంది.