విభజన: ఐదుగురితో శాంతిభద్రతలపై టాస్క్ఫోర్స్
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శాంతిభద్రతల అంశంపై నివేదిక సమర్పించడానికి ఐదుగురు సభ్యులతో టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్పోర్స్కు సీనియర్ అధికారి విజయకుమార్ నేతృత్వం వహిస్తారు. గంధం చెక్కల స్మగ్లర్ వీరప్పన్ వేట కోసం వేసిన టాస్క్ఫోర్స్కు ఆయనే నేతృత్వం వహించారు. విజయకుమార్ తమిళనాడుకు చెందినవారు.
కాగా, ఈ కమిటీలో ఇద్దరు రాష్ట్రానికి చెందివారున్నారు. మాజీ డిజిపి మహంతి, ఐపియస్ అధికారి జెవి రాముడు కమిటీలో ఉన్నారు. ఐఎఎస్ అధికారి రాజీవ్ శర్మ, ఐపియస్ అధికారి వాసన్ కూడా ఈ కమిటీలో ఉన్నారు. వీరు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ రేపు మంగళవారం హైదరాబాద్ చేరుకుంటుంది.
ఉదయం ఎనిమిదిన్నర గంటలకు హైదరాబాదు చేరుకుని లేక్వ్యూ అతిథి గృహంలో సమావేశమవుతుంది. వీరు రాష్ట్రంలోని సీనియర్ పోలీసు అధికారులతో సమావేశమవుతారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో హోంశాఖకు చెందిన ఆస్తులు, అప్పులు ఎలా పంపిణీ చేయాలనే విషయాన్ని కూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది. అలాగే, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను చేసినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు ఇస్తుంది.
రాష్ట్ర విభజన తర్వాత అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో ఉత్పన్నమయ్యే శాంతిభద్రతల సమస్యలు ఏమిటి, వాటిని ఎలా ఎదుర్కోవాలనే విషయాలను ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. నవంబర్ 5వ తేదీలోగా ఈ టాస్క్ఫోర్స్ కేంద్ర హోంశాఖకు నివేదిక సమర్పించాల్సి ఉంది.