ఇటలీ గణతంత్రం: జూన్ 2న తెలంగాణ రాష్ట్రావతరణ
న్యూఢిల్లీ: ఇటలీ గణతంత్ర దినోత్సవం జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతోంది. ఈ ఏడాది జూన్ 2వ తేదీన తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఏర్పాటు కాబోతున్నాయి. యాదృచ్ఛికమే కావచ్చు గానీ అదే రోజు సోనియా పుట్టిన దేశం ఇటలీ గణతంత్ర దినోత్సవం. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించనుంది.
13 జిల్లాలతో పాత పేరు ఆంధ్రప్రదేశ్తోనే కొత్త రాష్ట్రం ఏర్పాటు కానుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి కేంద్ర హోంశాఖ విభజన తేదీ (అప్పాయింటెడ్ డే) నిర్ణయిస్తూ భారత రాజపత్రం (గెజిట్) ప్రకటించింది. కేంద్రం హోంశాఖ కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ దీన్ని జారీ చేశారు. జూన్ నెలలో మొదటి పని దినమైన 2వ తేదీ నుంచి అధికారికంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందని, ఆంధ్రప్రదేశ్ మరో రాష్ట్రంగా కొనసాగుతుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్సభలో ఫిబ్రవరి 18న, రాజ్యసభలో 20వ తేదీన ఆమోదించారు. పార్లమెంటు ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈనెల 1న ఆమోద ముద్ర వేశారు. దీనిపై భారత ప్రభుత్వం 'అసాధారణ గెజిట్' కూడా ముద్రించింది. ఆదాయం, ఆస్తులు, ఇతరత్రా వనరులు, ఉద్యోగుల పంపిణీ పూర్తి చేసేందుకు కనీసం మూడు నెలలు పడుతుందని అధికార వర్గాలు చెప్పాయి. అధికార యంత్రాంగం అభిప్రాయానికి అనుగుణంగా విభజన తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలావుండగా, మంగళవారం సాయంత్రం గవర్నర్ నరసింహన్ ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి షిండేను కలుసుకున్నారు. ఆ తర్వాతే రాష్ట్ర ఆవిర్భావ దినంపై అధికారులు కసరత్తు వేగిరం చేసినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications