మా బంధం సుదీర్ఘమైంది: జగన్కు అఖిలేష్ మద్దతు
లక్నో: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే క్రమంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ శుక్రవారంనాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ను కలిశారు. పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకించాలని జగన్ ఆయనను కోరారు. అందుకు అఖిలేష్ మద్దతు లభించింది.
ఇరువురు నేతలు కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ సమాజ్వాదీ పార్టీ చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకమని, రాష్ట్రాల విభజనకు తమ పార్టీ వ్యతిరేకమని అఖిలేష్ యాదవ్ అన్నారు. రాష్ట్రాలను విభజించినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాంచల్ విడిపోయినా సమస్యలు అలాగే ఉన్నాయని ఆయన అన్నారు.
పార్లమెంటులో తాము తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని ఆయన చెప్పారు. రాజకీయ విధానాలతో సంబంధం లేకుండా తమ స్నేహం కొనసాగుతోందని ఆయన చెప్పారు. తమ బంధం సుదీర్ఘమైందని ఆయన అన్నారు.
వైయస్ జగన్ శుక్రవారంనాడు లక్నోకు చేరుకున్నారు. ఆయనకు లక్నోలోని విమానాశ్రయంలో యుపి తెలుగు సంఘం స్వాగతం పలికింది. గతంలో రెండు సార్లు అఖిలేష్ యాదవ్తో జరగాల్సిన భేటీ వాయిదా పడింది. ఇంతకు ముందు జగన్ వివిధ జాతీయ పార్టీల నాయకులను కోరారు.