కర్ణాటక ఎన్నికలు: తెలుగు ఓటర్లే కీలకం, బిజెపికి షాకిస్తారా, హోదా అస్త్రంతో కాంగ్రెస్
బెంగుళూరు: కర్ణాటకలో ప్రస్తుతం సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ సెటిలైన తెలుగు ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారనేది ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన బిజెపికి వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో ఓటు చేయాలని ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి ఇటీవల బెంగుళూరులో కోరారు. జెడీఎస్కు ఓటు చేయాలని తెలంగాణ సీఎం కెసిఆర్ తెలుగు ప్రజలను కోరారు. కర్ణాటక రాష్ట్రంలో సుమారు 15 శాతం ఓటర్లు తెలుగువారే ఉన్నారు. సుమారు 30 నుండి 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో వీరు ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.
ఈ ఏడాది మే 12న కర్ణాటక రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపిలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే వచ్చిన సర్వేలు మాత్రం రాష్ట్రంలో హాంగ్ వచ్చే అవకాశం ఉందని ప్రకటించాయి అయితే మరోసారి తాము అధికారాన్ని దక్కించుకొంటామని కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
అయితే కర్ణాటకలో విజయం సాధించి దక్షిణాదిలో కూడ తమకు ప్రాబల్యం ఉందని చెప్పుకొనేందుకు బిజెపి పావులు కదుపుతోంది అయితే ఇప్పటివరకు ఉన్న సర్వే రిపోర్టుల ఆధారంగా హాంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

కర్ణాటకలో తెలుగు ఓటర్లు ఎటు మొగ్గుచూపుతారు
కర్ణాటక రాష్ట్రంలోని ఓటర్లలో సుమారు 15 శాతం ఓటర్లు తెలుగువారు ఉన్నట్టు ఓ అంచనా. కర్ణాటక రాష్ట్ర జనాభా సుమారు 6 కోట్లు ఉంటుందని అంచనా. అయితే వీరిలో సుమారు 20 నుండి 25 లక్షల మంది వరకు తెలుగువారు ఓటర్లుగా నమోదై ఉంటారని పార్టీలు అంచనావేస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో సుమారు 80 నుండి 85 లక్షల వరకు తెలుగువారు కర్ణాటకలో స్థిరపడినట్టుగా అంచనాలున్నాయి.

ఏపీ నేతలు బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హమీని బిజెపి ఇంతవరకు నేరవేర్చలేదు దీంతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి కర్ణాటక రాష్ట్రంలో తెలుగు ఓటర్లపై ఈ ప్రభావం లేకపోలేదు. దీంతో గత వారం రోజుల క్రితం బెంగుళూరులో పర్యటనకు వెళ్ళిన ఏపీ రాష్ట్ర డీప్యూటీ సీఎం కె.ఈ కృష్ణమూర్తి బిజెపికి వ్యతిరేకంగా ఓటు చేయాలని కర్ణాటక రాష్ట్రంలోని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఏపీ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి కూడ కర్ణాటకలో ప్రచారంలో భాగంగా బిజెపికి వ్యతిరేకంగా ఓటు చేయాలి కోరారు. మరోవైపు కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి టిడిపి నేతల టీమ్ను పంపుతోందని ఏపీ రాష్ట్రానికి చెందిన బిజెపి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో తెలుగు ప్రజలంతా జెడీఎస్కు ఓటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కోరారు.

తెలుగు ఓటరు ఎటువైపు
కర్ణాటక రాష్ట్రంలోని 12 జిల్లాల్లోని సుమారు 30 నుండి 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు తమ ప్రభావాన్ని చూపే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. తెలుగు ఓటర్లు కూడ పార్టీల వారీగా విడిపోయారు. రాష్ట్రంలోని బిజెపి, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలతో తెలుగు ఓటర్లు ఉన్నారు. ఆయా పార్టీల తరుపున తెలుగువారు పోటీ చేస్తున్న సందర్భాలు కూడ చోటు చేసుకొన్నాయి అయితే ఈ ఎన్నికల్లో పార్టీలను కాదని ప్రాంతం కోసం ఓటు చేస్తారా, లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఆయా పార్టీల అభ్యర్ధులు గెలుపు ఓటములపై మాత్రం ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తెలుగు ఓటర్ల కోసం బిజెపి పాట్లు
కర్ణాటక ఎన్నికల్లో బిజెపిని ఓడించడం ద్వారా గట్టి బుద్దిచెప్పాలని ఏపీ రాష్ట్రానికి చెందిన టిడిపి, కాంగ్రెస్ పార్టీలు వ్యూహత్మకంగా ప్రయత్నాలు చేస్తున్నాయనే ప్రచారం లేకపోలేదు అయితే కర్ణాటకలో తెలుగు క్యాంపులు ఎక్కువగా ఉన్న చోట బిజెపి నేతలు మురళీధర్ రావు, పురంధరేశ్వరీతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడ కర్ణాటక ప్రచారానికి తరలివెళ్ళారు. బిజెపిపై వ్యతిరేకంగా బెంగుళూరులో తమకు ఓటు చేస్తారని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలుగు ఓట్లపై నమ్మకంతో ఉన్నారు. ఏపీకి చెందిన నేతలతో పరిచయాలున్నవారు, అక్కడి వారితో బంధుత్వాలు, ఆ ప్రాంతానికి చెందినవారు మాత్రం బిజెపి పట్ల కొంత అసంతృప్తితో ఉన్నారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ తరుణంలో తెలుగు ఓటర్లను ఆకట్టుకొనేందుకు బిజెపి నేతలు హమీలను గుప్పిస్తున్నారు. తెలుగు వారి బాగోగుల్ని చూసుకొంటామని మాజీ సీఎం యెడ్యూరప్ప హమీ ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications