ఈ దేవాలయాల్లో ప్రసాదంగా డబ్బులు, బంగారం..!
ఆలయాల్లో సాధారణంగా లడ్డూలు, పులిహోర వంటి తీర్థప్రసాదాలు అందిస్తారు. కానీ, మన దేశంలోని కొన్ని ఆలయాల్లో మాత్రం డబ్బులు, బంగారాన్ని ప్రసాదంగా పంచుతూ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. భక్తులకు కరెన్సీ నోట్లు, బంగారు నగలను ప్రసాదంగా అందించే ఈ విలక్షణ పద్ధతి సోషల్ మీడియాలో విశేషంగా వైరల్ అవుతోంది. తమిళనాడులోని కరుప్పసామి ఆలయం, మధ్యప్రదేశ్లోని మహాలక్ష్మి ఆలయాలు ఈ జాబితాలో ప్రముఖంగా నిలుస్తున్నాయి.
తమిళనాడులోని తేని జిల్లా, కడమలైకుండు సమీప కొండప్రాంతంలో కరుప్పసామి ఆలయం కొలువై ఉంది. ఇక్కడి ప్రధాన దైవం 'పద్దెనిమిదో మెట్టు' రక్షకుడైన కరుప్పసామి. కోర్టు కేసులు, కుటుంబ లేదా వ్యక్తిగత సమస్యలతో సతమతమయ్యే వారు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే న్యాయం జరుగుతుందని భక్తుల నమ్మకం.

ఈ ఆలయం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రాచుర్యం పొందడానికి ప్రధాన కారణం 'నగదు ప్రసాదం' పంపిణీయే. భక్తులకు మిఠాయిలకు బదులుగా కరెన్సీ నోట్లను ప్రసాదంగా ఇస్తారు. కష్టాలు తీర్చి, ఆర్థిక అండగా నిలవడమే దేవుని సంకల్పమని ఇక్కడి పూజారులు తరచుగా చెబుతుంటారు.
మధ్యప్రదేశ్లోని రత్లాం నగరంలోని మానక్ చౌక్ వద్ద ఉన్న మహాలక్ష్మి ఆలయం సిరిసంపదలకు నిలయంగా పేరు గడించింది. ఏడాది పొడవునా భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయం, దీపావళి సమయంలో మాత్రం ఒక అద్భుత లోకంలా మారుతుంది. ధనత్రయోదశి నుంచి ఐదు రోజుల వేడుకల్లో భాగంగా, ఆలయ గర్భాలయాన్ని భక్తులు సమర్పించిన నోట్ల కట్టలు, బంగారం, వజ్రాలతో అలంకరిస్తారు.
ఈ అలంకరణ విలువ అక్షరాలా రూ.100 కోట్లు దాటుతుందని అంచనా. పూర్వం రత్లాం మహారాజు రతన్ సింగ్ రాథోడ్ ప్రారంభించిన ఈ సంప్రదాయం నేటికీ నిరాటంకంగా కొనసాగుతోంది. దీపావళి సమయంలో భక్తులు తమ నగదును, నగలను అమ్మవారి చెంత ఉంచడం వల్ల సంపద రెట్టింపు అవుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు.
ఈ వేడుకలు ముగిసిన తర్వాత, భక్తులు సమర్పించిన వస్తువులను తిరిగి వారికే అప్పగిస్తారు. దీంతో పాటు కరెన్సీ నోట్లు, నాణేలను ప్రసాదంగా పంచుతారు. మన దేశంలో లక్షలాది ఆలయాలు ఉన్నా, ఈ రెండు ఆలయాలు తమ ప్రత్యేక ప్రసాద పంపిణీతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ, ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.












Click it and Unblock the Notifications