ఘోర ప్రమాదం: పెళ్లికెళ్తున్న 10మంది మహిళలు మృతి, 27మందికి గాయాలు
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బాలోద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వివాహానికి ప్రయాణికులను తీసుకెళుతున్న ట్రెయిలర్ ట్రక్కును వ్యాన్ ఢీకొనడం ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10మంది మహిళలు మృతి చెందగా, 27మందికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వ్యాన్ డ్రైవర్ మద్యం సేవించి నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదం దల్లిరాజ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్మూర్ కాసా గ్రామం వద్ద గురువారం తెల్లవారుజామున చోటు బాలోద్ ఎస్పీ షేక్ అరీఫ్ హుస్సేన్ తెలిపారు.
వ్యాన్లో సుమారు 40మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. ఎదురువస్తున్న ట్రక్కను వేగంగా ఢీకొనడంతో ఓ మైనర్ బాలికతో సహా 10 మంది మహిళలు అక్కడికక్కడే మృతి చెందారని చెప్పారు. మరో 27మంది గాయాలయ్యాయని, వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ఎస్పీ తెలిపారు.
సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం దుర్గ్కు తరలించినట్లు తెలిపారు. వ్యాన్ డ్రైవర్ మద్యం సేవించి నడపడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని ప్రాథమికంగా నిర్ధారించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.