అర్ధరాత్రి గుడిసెలకు మంటలు: 10మంది సజీవ దహనం
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లో రంబాన్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో 10 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో పంజాబ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు.
పోలీసుల కథనం ప్రకారం రంబాన్ జిల్లాలోని చండర్కోటే ప్రాంతంలో తల్వాస్ వద్ద ఓ టన్నెస్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కూలీల కోసం ఏర్పాటు చేసిన గుడిసెలు తగలబడ్డాయి. దీంతో ఈ ప్రమాదంలో 10 మంది సజీవ దహనమయ్యారు.
అయితే అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో షార్ట్సర్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని జమ్మూ కాశ్మీర్ ఐజీపీ దనేష్ రాణా వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఈ అగ్నిప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.