జయలలిత అండ చూసుకుని రూ. 10 వేల కోట్ల వ్యాపారం !
తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పీ. రామ్మోహన్ రావు కారణంగా టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి రూ. 10 వేల కోట్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకుని అక్రమంగా రూ వందల కోట్ల రూపాయలు
చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పీ. రామ్మోహన్ రావు కారణంగా టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి వందలాధి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకున్నారని అధికారులు వివరాలు సేకరించారు.
2011లో జయలలిత ముఖ్యమంత్రి అయిన సమయంలో రామ్మోహన్ రావు ఆమె కార్యదర్శిగా పని చేశారు. 2016లో జయలలిత మళ్లీ సీఎం అయిన తరువాత రామ్మోహన్ రావు అందరిని ఆశ్చర్యానికి గురి చేసి ఏకంగా తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యారు.
జయలలితతో పాటు నెచ్చెలి శశికళకు ఈయన చాల సన్నిహితుడు. పేరు ఐఏఎస్ అధికారి అయినా అన్నాడీఎంకే పార్టీలో అందరికి కీలక వ్యక్తిగా మారిపోయారు. జయలలిత ఉన్నంత వరకు రామ్మోహన్ రావు చెప్పిందే వేదం అని సమాచారం.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన రామ్మోహన్ రావుకు'తెలుగు సెంటిమెంట్'తో శేఖర్ రెడ్డి దగ్గర అయ్యారు. ఆ విధంగా రామ్మోహన్ రావు ఆశీస్సులతో ఇప్పటి వరకు శేఖర్ రెడ్డి రూ. 10 వేల కోట్ల వ్యాపారం (కాంట్రాక్టులు) చేశారని అధికారుల విచారణలో వెలుగు చూసింది.
చాల కాలం నుంచి ఐటీ అధికారులు రామ్మోహన్ రావు మీద కన్ను వేశారు. అయితే జయలలిత ఉన్నంతవరకూ ఆయనను ఐటీ అధికారులు టచ్ చెయ్యలేదు. మొదట శేఖర్ రెడ్డి పని పట్టిన ఐటీ శాఖ అధికారులు తరువాత రామ్మోహన్ రావు మీద దృష్టి పెట్టారు.
ఇప్పుడు శేఖర్ రెడ్డి ఇచ్చిన పక్కా సమాచారంతో రామ్మోహన్ రెడ్డికి సమన్లు జారీ చేసిన ఐటీ అధికారులు ఆయన ఇంటి మీద దాడి చేసి సోదాలు చేస్తున్నారు. రూ. 10 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు తీసుకున్న శేఖర్ రెడ్డి ప్రతిఫలంగా రామ్మోహన్ రావుకు ఏమీ ఇచ్చారు ? అని అధికారులు ఆరా తీస్తున్నారు.
ప్రభుత్వ పరంగా రామ్మోహన్ రావు వ్యాపారవేత్త శేఖర్ రెడ్డికి ఇంకా ఎలాంటి సహాయ సహకారాలు అందించారు ? ఎప్పటి నుంచి ఈ తతంగం జరుగుతున్నది ? అని ఐటీ శాఖ అధికారులు కూపీలాగుతున్నారు.