ఢిల్లీలో మళ్లీ రైతుల పోరాటం-కేంద్రమంత్రి అరెస్టు కోరుతూ- సరిహద్దుల్లో నిర్బంధం
యూపీలోని లఖీంపూర్ ఖేరీలో గతేడాది రైతుల్ని కారుతో తొక్కించిన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను అరెస్టు చేసి జైలుకు పంపినా బాధిత కుటుంబాలకు మాత్రం న్యాయం జరగలేదు. దీంతో సదరు కుటుంబాలు ఇప్పటికీ పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు మరోసారి ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇవాళ నిరసనలు చేపట్టాలని సంయుక్త్ కిసాన్ మోర్చా నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ-యూపీ సరిహద్దు సమీపంలోని ఘాజీపూర్లో నిరసన తెలుపుతున్న రైతులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద 'మహాపంచాయత్'కు రైతులు పిలుపునిచ్చారు. ఇందులో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో రైతులు నగరానికి బయలుదేరారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు.. ఢిల్లీ-హర్యానా సరిహద్దులో భద్రతను పెంచారు. బారికేడ్లు వేసి సిబ్బందిని మోహరించారు.

బారికేడ్ల కారణంగా ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులు ఇరుక్కుపోవడంతో రాజధాని సమీపంలోని ఢిల్లీ-ఘాజీపూర్ సరిహద్దులో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఢిల్లీ వెలుపలి నుంచి రైతులు వస్తున్నందున ఢిల్లీలోని సింఘు సరిహద్దు, తిక్రీ సరిహద్దుల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్ మంతర్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు ఉండగా, న్యూఢిల్లీ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. చాలా చోట్ల రోడ్లపై కాంక్రీట్ స్లాబ్లు వేసి రైతులకు రాకుండా చేస్తున్నారు.
సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే 'మహాపంచాయత్'కు అనుమతి నిరాకరించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. లఖింపూర్ ఖేరీలో బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, జైళ్ల నుంచి రైతులను విడుదల చేయాలని కోరుతూ రైతులు మహాపంచాయత్కు పిలుపునిచ్చారు. లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తేనీని అరెస్టు చేయాలని రైతు సంఘం డిమాండ్ చేస్తోంది.












Click it and Unblock the Notifications