హోటల్ నుంచి అనుమానిత ఉగ్రవాదుల పరారీ!
భువనేశ్వర్: ఒడిశా రాజధాని భువనేశ్వర్లో నలుగురు అనుమానిత ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు అనుమానిత ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారు.
భువనేశ్వర్లోని ఓ హోటల్లో ఉండేందుకు నలుగురు వ్యక్తులు వచ్చారు. గుర్తింపు కార్డులు అడగ్గా.. ఆ నలుగురు అక్కడ్నుంచి పారిపోయారు. కాగా, ఈ విషయం పోలీసుల దాకా వెళ్లింది. ఆ నలుగురు ఉగ్రవాదులే అయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ రిజిస్ట్రేషన్ కారుతో అనుమానిత ఉగ్రవాదులు వచ్చారని, వారందరూ విదేశీయులేనని వారిని చూసిన కొందరు తెలిపారు. అయితే, ఆ వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ నకిలీదే అయి ఉంటుందని భావిస్తున్నారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని దేశ వ్యాప్తంగా పోలీసులు, భద్రతా దళాలు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాయి. ఐఎస్ ఉగ్రవాదుల బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.