జమ్మూకాశ్మీర్లో మళ్లీ అలజడి - సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రదాడి
ఆర్టికల్ 370 రద్దుతో ప్రత్యేక ప్రతిపత్తి కోల్పోయి, ఇండియాలో పూర్తిగా విలీనమైపోయిన జమ్మూకాశ్మీర్ లో ఏడాది తర్వాత మళ్లీ అలజడి నెలకొంది. సోమవారం సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేయడం సంచలనంగా మారింది. కుల్గాం జిల్లాలోని నెహమాలో ఉన్న సీఆర్పీఎఫ్ శిబిరంపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు జవాన్లు గాయపడ్డట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు అందిన సమాచారాన్ని బట్టి.. నెహమా సీఆర్పీఎఫ్ క్యాంపులోకి చొరబడేందుకు విఫలయత్నం చేసిన ఉగ్రవాదులు.. చెక్ పోస్టుపై విచక్షణా రహితంగా కాల్పులు చేసి పరారయ్యారు. ఈ ఘటనలో గాయపడ్డ జవాన్ ను ఆస్పత్రికి తరలించారు. పరారైన టెర్రరిస్టుల కోసం బలగాలు వేట మొదలుపెట్టాయి. ఈక్రమంలో దక్షిణ కాశ్మీర్ అంతటా కార్డెన్ సెర్చ్ చేపట్టారు.
వెనక్కి తగ్గని హీరో రామ్ పోతినేని - మరింత గట్టిగా ఎదురుదాడి - ఈసారి కులం పేరుతోనే
సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రదాడి జరగడానికి కొద్ది గంటల ముందు, సోమవారం ఉదయం ఉత్తర కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. బారాముల్లా జిల్లాలోని కరీవీ గ్రామంలో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులను మన బలగాలు హతమార్చాయి. ఎన్ కౌంటర్ కు ప్రతీకారంగానే దాడి చేశారా? ఇది ఏ గ్రూపు పని? అనే వివరాలు తెలియాల్సిఉంది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ వ్యాలీలో టెర్రరిజం 40 శాతం తగ్గిపోయింది. ఉగ్రవాదంపైపు ఆకర్షితులవుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. సైనిక పరంగా ఉక్కుపాదం మోపడం, కాశ్మీరీల్లో భరోసా కల్పించే ప్రయత్నాలు ముమ్మరం కావడంతోనే ఈ మార్పు సాధ్యమైంది. గడిచిన ఏడాది కాలంలో ఉగ్రవాదానికి ఆకర్షితులైన వారు కేవలం 67 మంది మాత్రమేనని వెల్లడైంది. దాదాపు ఏడాదిగా ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ లో ఇవాళ్టి ఉగ్రదాడి ఘటన కలకలం రేపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.