కిడ్నాప్యత్నం: ఆటోలోంచి దూకిన టెక్కీ, కోమాలోకి
థానే: తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని గమనించిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అతని బారినుంచి తప్పించుకునేందుకు ఆటోలో నుంచి దూకి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో మంగళవారం జరిగింది. గమనించిన స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం స్వప్నాలీ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమె ఇప్పటికీ కోమా నుంచి బయటికి రాలేదు.
స్వప్నాలి నితిన్ లాండ్(24) థానేలోని వెజిల్ ఎస్టేట్లోని ఐటి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తోంది. మంగళవారం విధులు ముగించుకున్న ఆమె.. కుపుర్బావ్డీ నుంచి కొల్హేట్లో ఉన్న తన ఇంటికి రాత్రి 9.15గంటల ప్రాంతంలో ఓ ఆటోలో బయల్దేరింది. డ్రైవర్ కొల్హెట్ వైపు కాకుండా భివండీ ప్రాంతం వైపు ఆటోను తీసుకెళ్తుండటంతో ఆమె కేకలు వేసింది.

అయినా ఆటో డ్రైవర్ వినకుండా వెళుతుండటంతో ఆ యువతి భయపడి బయటకు దూకేసిందని ఘటన స్థలంలో ఉన్నవారు చెప్పారు. పట్టుకుందామని ప్రయత్నించినా అతడు దొరకలేదని తెలిపారు.
కాగా, ఆటో నుంచి బయటకు దూకడంతో యువతి తలకు, పొట్ట భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
కాగా, స్వప్నాలీ ఎప్పుడూ తన సహోద్యుగులతోనే ఇంటికి వెళ్తుందని, అయితే ఆ రోజుమాత్రం ఒంటరిగా బయల్దేరిందని బాధితురాలి కజిన్ సౌరవ్ చెప్పాడు. అయితే ఆమె తల్లి ఫోన్ చేసినప్పుడు తాను ఇంటికి వస్తున్నట్లు, దారిలోనే ఉన్నానని స్వప్నాలి ఆమెకు చెప్పిందని తెలిపాడు. ఆ యువతి తండ్రి నితిన్ లాడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications