హిందూ దేవుళ్లంటే ఆటలా - నిషేధించండి: రకుల్ ప్రీత్ సినిమా చుట్టూ వివాదాలు..!!
భోపాల్: బాలీవుడ్ అప్ కమింగ్ మూవీ.. థ్యాంక్ గాడ్. అజయ్ దేవ్గణ్, సిద్ధార్థ్ మల్హోత్ర, రకుల్ ప్రీత్ సింగ్ నటించారిందులో. మైథలాజికల్, పునర్జన్మ, స్వర్గం-నరకం అనే పాయింట్ మీద తెరకెక్కిన ఈ కామెడీ సినిమాకు ఇంద్రకుమార్ దర్శకత్వం వహించారు. దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 25వ తేదీన విడుదల కాబోతోంది. ఇటీవలే ట్రైలర్ విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ను కూడగట్టుకుంది. వివాదాలను కూడా కొని తెచ్చుకుంది.
మోడర్న్ చిత్రగుప్తుడిగా..
అజయ్ దేవ్గణ్- ఓ మోడర్న్ చిత్రగుప్తుడిగా నటించాడు. సూట్- బూట్ వేసుకుని, కూలింగ్ గ్లాసెస్, ఇయర్ రింగ్స్తో స్టైలిష్గా కనిపించాడు. నరకాన్ని కూడా అదే స్థాయిలో సెట్ చేశారు. యమదూతలు కూడా అదే రేంజ్లో ఉంటారీ మూవీలో. ఈ సినిమాలో హిందూ దేవుళ్లను కించపరిచారనే వాదనలు తలెత్తాయి. దీన్ని నిషేధించాలనే డిమాండ్ కూడా ఊపందుకుంటోంది. కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
మంత్రి జోక్యం..
థ్యాంక్ గాడ్ సినిమాను నిషేధించాలని మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ డిమాండ్ చేశారు. హిందు దేవుళ్లను అనుచితంగా ప్రదర్శించాని ఆరోపించారు. ఈ మేరకు ఆయన కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్కు లేఖ రాశారు. చిత్రం యూనిట్ హిందూ దేవుళ్లను అనుచితంగా చిత్రీకరించిందని పేర్కొన్నారు. హిందూమతాన్ని అపహాస్యం చేసేలా, కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సినిమా చిత్రీకరణ జరుపుకొందని అన్నారు.
కోర్టులో పిటీషన్..
ఇదివరకు ఇదే విషయంపై హిమాన్షు శ్రీవాస్తవ అనే న్యాయవాది జాన్పూర్ కోర్టులో కేసు దాఖలు చేశారు. దర్శకుడు ఇంద్ర కుమార్, నటులు అజయ్ దేవగన్, సిద్ధార్థ మల్హోత్రపై చర్యలు తీసుకోవాలని కోరారు. సూటు ధరించిన అజయ్ దేవగణ్ ఆధునిక చిత్రగుప్తుడి పాత్రలో నటించాడని, ఒక సన్నివేశంలో జోకులు పేల్చడం, అభ్యంతరకరమైన పదజాలం వాడటం కనిపించిందని శ్రీవాస్తవ తన పిటిషన్లో పేర్కొన్నారు.
మనోభావాలతో..
హిందూ ధర్మం ప్రకారం.. చిత్రగుప్తుడిని కర్మకు ప్రభువుగా పరిగణిస్తారని పేర్కొన్నారు. దేవుళ్లను ఇలా అభ్యంతరకరంగా చిత్రీకరించడం అనేది మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుందని హిమాన్షు శ్రీవాస్తవ చెప్పారు. ఇదే విధానాన్ని ఇతర సినిమాలు కూడా అనుకరించే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీనిపై మధ్యప్రదేశ్ మంత్రి విశ్వాస్ సారంగ్ స్పందించారు. థ్యాంక్ గాడ్ సినిమాను నిషేధించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్కు లేఖ రాశారు.
బ్యాన్ చేయండి..
జీవన్మరణం మధ్య కొట్టుమిట్టాడే వ్యక్తితో చిత్రగుప్తుడు క్విజ్ ఆడేలా చిత్రీకరించడం సరికాదని అభిప్రాయపడ్డారు. గేమ్ ఆఫ్ లైఫ్ పేరుతో మనుషుల భావోద్వేగాలతో ఆటలాడేలా సినిమాను తీశారని, ఇది అభ్యంతరకరమని పేర్కొన్నారు. సినిమాను నిషేధించాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతోందని, కోట్లాదిమంది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్నందున.. దీనిపై సానుకూలంగా స్పందించాలని మంత్రి విశ్వాస్ సారంగ్.. కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.