పాతపాట పాడటానికి సిద్దం అవుతున్న మోదీ టీమ్ ?, అదే జరిగితే చెక్క భజనే అంటున్న క్యాడర్ !
లోక్సభ ఎన్నికలు జరగడానికి మరికొద్ది నెలలు మాత్రమే సమయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కో పార్టీ ఒక్కో వ్యూహం రచిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కర్ణాటకలో చాలా మంది కొత్త ముఖాలను రంగంలోకి దింపడానికి సిద్ధం అవుతోందని తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో పలువురు సిట్టింగ్ ఎంపీలకు టిక్కెట్లు ఇవ్వకూడదనే ఆలోచనలో బీజేపీ నాయకులు ఉన్నారని తెలిసింది.
ప్రస్తుతం ఉన్న 25 మంది బీజేపీ ఎంపీల్లో 11 మందికి టిక్కెట్టు గల్లంతు అయ్యే అవకాశం ఉందని తెలిసింది. ఈ సమయంలో చాలా మంది సిట్టింగ్ ఎంపీలు కూడా కొన్ని కారణాల వల్ల త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. తాను ఇప్పట్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బెంగళూరు బీజేపీ ఎంపీ సదానందగౌడ ఇటీవల బహిరంగంగా ప్రకటించారు.

బీజేపీ ఎంపీలు జీఎం సిద్ధేశ్వర్ (72), రమేష్ జిగజినాగి (72) వయసు రీత్యా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అదే సమయంలో అనంత కుమార్ హెగ్డే ఆరోగ్య సమస్యలతో తాను పోటీ చెయ్యడం లేదని అన్నారు. అంతే కాకుండా వ్యక్తిగత కారణాలతో శివకుమార్ ఉదాసి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఇక చిక్కబళ్లాపురం ఎంపీ బీఎన్ బచ్చెగౌడ (82), మంగళ అంగడి, జీఎస్ బసవరాజ్, వి.శ్రీనివాస్ ప్రసాద్, వై.దేవేంద్రప్ప తదితరులు ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పారు.
కొందరు ఎంపీలు మాకు 70 ఏళ్లు పైబడిందని, అందుకే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యమని అంటున్నారు. మూడుసార్లకు పైగా లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన నేతల స్థానంలో కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఈసారి జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలో జేడీఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకుంది.

దీంతో బీజేపీ 24 స్థానాల్లో, జేడీఎస్ నాలుగు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందనేది మరో వాదన. ఈ నేపథ్యంలో కూడా బీజేపీకి కొన్ని స్థానాలు మారవచ్చు. ప్రస్తుతం బీజేపీ ఎంపీల వద్ద ఉన్న కొన్ని స్థానాలను జేడీఎస్ గెలుచుకునే అవకాశం ఉంది. జేడీఎస్ బలంగా ఉన్న మండ్య, హాసన్, తుమకూరు, చిక్కబళ్లాపురం, బెంగళూరు రూరల్ లోక్ సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని కోరుతోంది. కోలారు, హాసన్, మండ్య, బెంగళూరు రూరల్ నియోజకవర్గాల ఇవ్వాలని బీజేపీ ఆలోచిస్తోంది. ప్రస్తుతం హాసన్లో మాత్రమే జేడీఎస్కు ఒక ఎంపీ ఉన్నారు.
మొత్తం మీద సిట్టింగ్ ఎంపీలకు టిక్కెట్లు ఇవ్వకుండా కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని బీజేపీ ఆలోచిస్తే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మళ్లీ రిపీట్ అయితే మా పరిస్థితి ఏమిటి అని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకించిన బీజేపీ కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications