షిర్డీ సాయిబాబా సంస్థాన్పై సంచలన నిర్ణయం: హైకోర్టు ఆదేశాలతో..!!
ముంబై: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం షిర్డీలోని సాయిబాబా సంస్థాన్పై బోంబే హైకోర్టు సంచలన ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆలయం పాలక మండలిని రద్దు చేసింది. ఇదివరకు ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డ్ ఇంకా కొనసాగుతుండటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్పై విచారణ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఎనిమిది వారాల్లోగా కొత్త ట్రస్ట్ బోర్డ్ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
ఉద్ధవ్ థాకరే సారథ్యంలో శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో షిర్డీ సాయిబాబా సంస్థాన్ పాలక మండలి ఏర్పాటైంది. ఛైర్మన్, సభ్యులను నియమించంది ఉద్ధవ్ ప్రభుత్వం. జయంత్ జాదవ్, మహేంద్ర షెల్కె, సురేష్ వాబ్లే, అనురాధ అదిక్, డాక్టర్ సాయిబాబా, ఏక్నాథ్ గోండ్కర్, సచిన్ గుర్జర్, రాహుల్ కనల్, సుహాస్ ఆహిర్ను అప్పట్లో సంస్థాన్ పాలకమండలి సభ్యులుగా అపాయింట్ చేసింది.
దీన్ని సవాల్ చేస్తూ షిర్డీకి చెందిన ఉత్తమ్ షెల్కె అనే సామాజిక కార్యకర్త బోంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్లో పిటీషన్ దాఖలు చేశారు. తన వాదనలను వినిపించారు. షిర్డీ సాయిబాబా సంస్థాన్ పాలకమండలిలో ఇప్పుడున్న సభ్యులందరూ గత ప్రభుత్వం నియమించిన వారేనని గుర్తు చేశారు. ట్రస్టీలను నియమించిన ప్రభుత్వమే లేనప్పుడు వారికి కూడా పాలక మండలిలో కొనసాగే అర్హత లేదని ఉత్తమ్ షెల్కె తరఫు న్యాయవాది వినిపించిన వాదనలతో ఏకీభవించింది.
పైగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సారథ్యంలో ఇప్పుడున్న ప్రభుత్వానికి చెడ్డపేరును తీసుకుని వచ్చే విధంగా పాలకమండలి సభ్యులు వ్యవహరించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన వాదనలతో ముంబై హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ ఏకీభవించింది. పాలక మండలిని రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. కొత్త ట్రస్ట్ బోర్డును ఎనిమిది వారాల్లోగా నియమించాల్సి ఉంటుందని న్యాయమూర్తులు జస్టిస్ ఆర్డీ ధనూక, జస్టిస్ ఎస్జీ మెహరె ఆదేశాలు జారీ చేశారు.