బొగ్గు కుంభకోణం: ఢిల్లీ రాఠి కంపెనీపై చీటింగ్ కేసు
న్యూఢిల్లీ: బొగ్గు స్కాం కేసులలో పలు కంపెనీలు చేరుతున్నాయి. తాజాగా ఢిల్లీకి చెందిన రాఠి స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కంపెనీ (ఆర్ఎస్ సీఎల్) కంపెనీ మీద కేసులు నమోదు అయ్యాయి. మంగళవారం ఈ కంపెనీ మీద కేసులు నమోదు చెయ్యాలని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
బొగ్గు బ్లాకుల అక్రమ కేటాయింపుల కేసు విచారణ మంగళవారం ప్రత్యేక కోర్టులో జరిగింది. ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి భరత్ పరాశర్ రాఠి స్టీల్ కంపెనీ మీద కేసు నమోదు చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కంపెనీ తో పాటు అందులోని పలువురు అధికారుల మీద కేసులు నమోదు చేశారు.

రాఠి కంపెనీ, ఆ కంపెనీ సీఈవో ఉదిత్ రాఠి, ఎండీ, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ తదితరుల మీద కుట్ర, చీటింగ్ కేసులు నమోదు అయ్యాయి. కేసు తదుపరి విచారణ జూన్ రెండవ తేదికి వాయిదా వేస్తున్నామని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
బొగ్గు బ్లాక్ ల కేటాయింపుల కుంబకోణంలో ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి, సినీ దర్శకుడు దాసరి నారాయణరావుతో పాటు జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ, గ్రీన్ ఇన్ ప్రా, బీఎల్ఏ ఇండస్ట్రీస్, కాస్ట్రాన్ టెక్నాలజీ, జార్ఖండ్ ఇస్ఫాత్, వినీ ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగ్, జేఎల్ డీ యూవత్మాల్ తదితర కంపెనీల మీద సీబీఐ అధికారులు 14 కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ లు తయారు చేశారు.












Click it and Unblock the Notifications