సోనియా వారసుడెవరు - నేడే నోటిఫికేషన్ : ఆ ఇద్దరి మధ్యే పోటీ..!!
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నేడు నోటీఫికేషన్ వెలువడనుంది. రెండు దశాబ్దాల తర్వాత సోనియాగాంధీ వారసుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. అధ్యక్ష పదవి నుంచి సోనియా తప్పుకోవాలని నిర్ణయించటం, ఆ తరువాత రాహుల్ అధ్యక్ష బాధ్యతల స్వీకరణకు అంగీకరించకపోవటంతో ఎన్నికలు తప్పని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ గురువారం ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. ఈ నెల సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇస్తారు. అక్టోబర్ 1న నామినేషన్ పత్రాల పరిశీలన, అక్టోబర్ 8న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అక్టోబర్ 17న ఓటింగ్ నిర్వహించిన రెండు రోజుల తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు.
గెహ్లాట్ వర్సస్ థరూర్
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై సరైన స్పష్టత లేకపోయినప్పటికీ రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ బరిలోకి దిగటం ఖాయంగా కనిపిస్తోంది. భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్దంగా లేరని చెబుతున్నారు. అశోక్ గెహ్లాట్ తాజాగా సోనియాతో సమావేశమయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉంటానని, తనకు మరి కొంత కాలం రాజస్థాన్ సీఎంగానూ కొనసాగేందుకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే, తాను సూచించిన వారిని రాజస్థాన్ సీఎంగా అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు విరుద్దంగా సచిన్ పైలైట్ ప్రకటన చేసారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని కోరుతూ, ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై సరైన స్పష్టత లేకపోయినప్పటికీ రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది.
రాహుల్ పోటీ చేసే ఛాన్స్ లేనట్లేనా
కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టాలని అన్ని వైపుల నుంచి రాహుల్గాంధీపై ఒత్తిడి పెరుగుతోంది. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్గాంధీని మరోసారి కలిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని మరోసారి కోరుతానని అశోక్ గహ్లోత్ వెల్లడించారు. నేతలంతా రాహుల్ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ఏఐసీసీ అధ్యక్ష పగ్గాలు చేపడితే.... రాజస్థాన్లో సీఎం మార్పు చేయాల్సి ఉంటుంది. ఇదే సమయంలో తాను అధ్యక్ష రేసులో ఉన్నానంటూ మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చెప్పారు. కానీ, ఆయన పోటీ పైన పార్టీ నేతలు నిర్దారణ చేయటం లేదు. ప్రధానంగా పోటీ ఇద్దరి మధ్యనే ఉండే అవకాశం కనిపిస్తోంది.
గెహ్లాట్ వైపే మొగ్గు
పోటీలో అశోక్ గహ్లోత్, శశిథరూర్ ఉండటం ఖాయమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఇరువురిలో ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు జోరందుకున్నాయి. గెలుపు పవనాలు గహ్లోత్ వైపే వీచే అవకాశం ఉందని తెలుస్తోంది. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. హిందీ మాట్లాడే వ్యక్తి కావడం వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో కీలకంగా వ్యవహరించగలరు.కాగా, పోటీలో ఉన్న మరో నేత శశిథరూర్.. వీటన్నింటికీ భిన్నమైన వ్యక్తి. ఆయన 2009లో కాంగ్రెస్లో చేరారు. పార్టీలో విభేదాలు భగ్గుమన్న సమయంలో గాంధీ కుటుంబానికి వ్యతిరేక బృందంలో ఉన్నారు. జీ23 నేతలతో కలిసి సోనియాకు లేఖ రాశారు. అందువల్ల ఎన్నికల్లో వీరిద్దరూ ఉంటే గహ్లోత్ కే గెలుపు అవకాశాలు ఉంటాయనే విశ్లేషణలు మొదలయ్యాయి.