14.5 గంటల పాటు చైనాతో సుదీర్ఘంగా: ఆ వ్యూహాత్మక ప్రాంతాన్ని ఖాళీకి మొండికేసిన డ్రాగన్?
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న వివాదాలు, ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించడానికి భారత్-చైనా మధ్య ఆరంభమైన చర్చలు మరోసారి అర్ధాంతరంగా ముగిశాయి. సుమారు 14.5 గంటల పాటు కొనసాగిన చర్చల వల్ల ఎలాంటి ఫలితమూ రాలేదని తెలుస్తోంది. ఇప్పటికీ.. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సైనిక శిబిరాలు కొనసాగుతోన్న ఒకట్రెండు ప్రాంతాలను ఖాళీ చేయడానికి డ్రాగన్.. అంగీకరించలేదని తెలుస్తోంది. భారత్కు భౌగోళికంగా, రక్షణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఇంకా చైనా సైనిక శిబిరాలు కొనసాగుతున్నాయి.
Recommended Video
విదేశీ విద్యార్థులకు గుడ్న్యూస్: ఆ ఆదేశాలపై వెనక్కి తగ్గిన అమెరికా..ఉపసంహరణ: కోర్టుల్లో
తెల్లవారు జామున 2 గంటల వరకూ
భారత్-చైనాకు చెందిన ఆర్మీ లెప్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య మంగళవారం ఉదయం 11:30 గంటలకు ఆరంభమైన చర్చలు సుమారు 15 గంటల పాటు కొనసాగాయి. భారత భూభాగంపైనున్న ఛుసుల్ దీనికి వేదికైంది. భారత్ తరఫున 14 కార్ప్స్ కమాండర్ లెప్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా వైపు గ్జిన్జియాంగ్ మిలటరీ రీజియన్ కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల వరకూ ఈ రెండు దేశాల మధ్య ఈ చర్చలు కొనసాగాయి. అయినా ఎలాంటి ఫలితమూ రాలేదని తెలుస్తోంది.
పంగ్యాంగ్ త్సొ, డెప్సాంగ్ ఖాళీకి ససేమిరా..
చైనా సైనికులు వాస్తవాధీన రేఖ సమీపంలోని గాల్వన్ వ్యాలీ వంటి కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను ఖాళీ చేశారు. వ్యూహాత్మకంగా రెండు దేశాలకూ కీలకమైన, సున్నతమైన పంగ్యాంగ్ త్సొ, డెప్సాంగ్ ప్లెయిన్ ప్రాంతంలో చైనా సైనిక శిబిరాలు ఇంకా కొనసాగుతున్నాయి. వాటిని ఖాళీ చేయాలంటూ భారత ఆర్మీ అధికారులు చేసిన డిమాండ్లకు చైనా అంగీకరించలేదని అంటున్నారు. పంగ్యాంగ్ త్సొ, డెప్సాంగ్ ప్రాంతాలను ఖాళీ చేయాలనే ప్రధాన డిమాండ్ను భారత ఆర్మీ అధికారులు అజెండాగా తీసుకున్నారని, దీని చుట్టే చర్చలు కొనసాగినట్లు తెలుస్తోంది.
నాలుగు విడతల్లో
సరిహద్దు వివాదాలపై ఈ రెండు దేశాల మధ్య ఇప్పటిదాకా లెప్టినెంట్ కమాండర్ స్థాయి సైనికాధికారుల మధ్య నాలుగు దశల్లో చర్చలు ముగిసినట్టయింది. ఇందులో ఏ ఒక్కటి కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదు. మూడో విడత నిర్వహించిన చర్చలు కూడా 12 గంటలకు పైగా సుదీర్ఘంగా కొనసాగాయి. అప్పట్లో చైనా ఎలాంటి వైఖరిని ప్రదర్శించిందో.. ఈ సారి కూడా అదే తరహాలో మొండిగా ప్రదర్శించిదని, పంగ్యాంగ్ త్సొ, డెప్సాంగ్ ప్లెయిన్లను ఖాళీ చేయడానికి ఏ మాత్రం అంగీకరించలేదని సమాచారం. ఇదే అంశంపై అయిదో విడత కూడా రెండు దేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం లేకపోలేదు.