ఆసక్తికరం: 184వ,సారి పోటీ, గిన్నిస్బుక్లో స్థానం, ఎవరీ డాక్టర్ పద్మరాజన్?
చెన్నై: తమిళనాడు రాష్ట్రానికి చెందిన డాక్టర్ పద్మరాజన్ మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఆర్కె నగర్ ఉప ఎన్నికల్లో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఆర్కె నగర్లో నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నికల బరిలోకి దిగడం 184వ, సారి కానుంది.
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా డాక్టర్ పద్మరాజన్ పోటీ చేస్తారు.ప్రత్యర్థి ఎంత పేరున్న నాయకుడైనా సరే, పోటీకి మాత్రం డాక్టర్ పద్మరాజన్ మాత్రం వెనుకాడరు.రాష్ట్రపతి ఎన్నికలను కూడ ఆయన వదల్లేదు.
ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కూడ డాక్టర్ పద్మరాజన్ పోటీ చేశారు. ప్రతి ఎన్నికల్లో కూడ నామినేషన్ దాఖలు చేయడం డాక్టర్ పద్మరాజన్కు అలవాటుగా మారింది. ప్రముఖులు పోటీచేస్తే స్థానాల్లో డాక్టర్ పద్మరాజన్ మాత్రం పోటీకి సై అంటారు.
184వ, సారి పోటీ చేస్తున్న డాక్టర్ పద్మరాజన్
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరగుతున్న డాక్టర్ పద్మరాజన్ పోటీ చేస్తారు. ప్రత్యర్థి ఎవరైనా సరే పద్మరాజన్ మాత్రం వెనుకడుగు వేయరు.గెలుపు, ఓటములను అసలు పట్టించుకోడు. నామినేషన్ దాఖలు చేస్తారు. ఎన్నికల బరిలో నిలుస్తారు. డాక్టర్ పద్మరాజన్ను అందుకే ముద్దుగా ఎలక్షన్ కింగ్గా పిలుస్తారు.ఇప్పటివరకు 183 దఫాలు డాక్టర్ పద్మరాజన్ పోటీ చేశారు. తాజాగా ఆర్కె నగర్ ఉప ఎన్నికల్లో కూడ డాక్టర్ పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన 184వ, సారి ఎన్నికల బరిలోకి దిగాడు.
1988లో తొలిసారిగా పోటీ
తమిళనాడు సేలంకు చెందిన పద్మరాజన్ డాక్టర్గా విధులు నిర్వహిస్తాడు.1988లో తొలిసారిగా ఆయన ఎన్నికల్లో పోటీచేశారు.అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ పోటీచేస్తూ వస్తున్నారు. ప్రత్యర్థి ఎవరైనా ఆయన పట్టించుకోరు.ప్రతి ఎన్నికల్లో పోటీ చేయడం అలవాటు చేసుకొన్నారు. దీంతో ఎన్నికల కింగ్గా మారిపోయారు.
ప్రముఖులపై పోటీ
ఏ ఎన్నికల్లోనైనా పోటీ చేయడానికి కూడ వెనుకాడడు డాక్టర్ పద్మరాజన్. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేశాడు. మాజీ రాష్ట్రపతులు కేఆర్ నారాయణ, అబ్దుల్ కలాం, ప్రతిభాపాటిల్, రామ్నాద్కోవింద్కు పోటీగా ఆయన నామినేషన్ దాఖలు వేశారు. వాజ్పేయి, జయలలిత, కరుణానిధి, పీవీ నరసింహరావు లాంటి వారికి పోటీగా కూడా ఎన్నికల బరిలోకి దిగారు.
పద్మరాజన్పై ఏపీలో దాడి
1991లో ప్రధాని పీవీ నరసింహరావుకు ప్రత్యర్థిగా పద్మరాజన్ నామినేషన్ వేసినప్పుడు ఆయనపై దాడి కూడా జరిగింది. 1991లో నంద్యాల పార్లమెంట్ స్థానం నుండి పీవీ నరసింహరావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ సమయంలో పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేస్తే ఆయనపై దాడి జరిగింది.అయినా సరే ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం మానట్లేదు. అయితే ఎందులోనూ ఆయన విజయం సాధించలేకపోయారు.
గిన్నిస్ బుక్ లో చోటు
ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ, నామినేషన్ దాఖలు చేసి పోటీలో ఉంటారు డాక్టర్ పద్మరాజన్. ప్రచారం నిర్వహించరు. ఎన్నికల కోసం ఒక్క రూపాయి కూడ ఖర్చు చేయరు. ఎక్కువ సార్లు పోటీ చేసినందుకు గాను గిన్నిస్బుక్లో డాక్టర్ పద్మరాజన్కు చోటు దక్కింది.లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోనూ డాక్టర్ పద్మరాజన్ పేరు నమోదైంది.