వేతనాల పెంపులో కోత!: పదేళ్లుగా ఇదే దుస్థితి.. దిగదుడుపే..
భారతదేశంలోని వివిధ రంగాల పరిశ్రమల్లో వేతనాల పెంపు 2007 నుంచి సగటున 15.1 శాతం నుంచి 2016 నాటికి 10.2 శాతానికి తగ్గుముఖం పట్టిందని ఓ సర్వే నిర్ధారించింది.
న్యూఢిల్లీ: భారతదేశంలోని వివిధ రంగాల పరిశ్రమలు పదేళ్లుగా నిరంతరం వేతనాల పెంపు సాధ్యమైనంత తగ్గిస్తూ వస్తున్నాయి. దశాబ్ద కాలం నాటి స్వర్ణయుగం నాటి పరిస్థితులు సమీప భవిష్యత్లో ఎంత తరచి చూసినా కనిపించే అవకాశాల్లేవని నిఫుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
దేశంలోని వివిధ రంగాల పరిశ్రమల్లో వేతనాల పెంపు 2007 నుంచి సగటున 15.1 శాతం నుంచి 2016 నాటికి 10.2 శాతానికి తగ్గుముఖం పట్టిందని ఆయోన్ హెవిట్ అనే కన్సల్టింగ్ సంస్థ నిర్వహించిన భారత కంపెనీల వేతనాల పెంపు అధ్యయనం నిర్ధారించింది.
2017లో కంపెనీలు సగటున 9.5 శాతం ఇంక్రిమెంట్ ప్రకటిస్తే, 2009లో అతి తక్కువగా 6.6శాతం మాత్రమే పెంచాయని ఈ సర్వే సారాంశం. అమెరికాలో లేమాన్ బ్రదర్స్ హోల్డింగ్స్ సంస్థ నిర్వాకంతో 2008లో ముందుకొచ్చిన అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఆ మరుసటి ఏడాది అతి తక్కువ వేతనాలు పెంచారు. ఆయోన్ హెవిట్ సంస్థ నిర్వహించిన సర్వే అత్యంత సమ్రగమైన అధ్యయనం అని నిపుణులు పేర్కొంటున్నారు.
దవ్యోల్బణంపై ఆర్బీఐ అంచనాలతో పోలిస్తే ఇలా
‘సగటున 9.5 శాతం వేతన ఇంక్రిమెంట్ కూడా ప్రామిసింగ్గా ఉంటుంది. భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)కు చెందిన ద్రవ్యోల్బణం అంచనాలు, నిజమైన వేతనాల పెంచడం ద్వారా సర్దుబాటు చేయడం అత్యంత నిరాశాజనకం. రూ.50 లక్షలకు పైగా సంపాదిస్తున్న ఉద్యోగిపై ట్యాక్స్ సర్చార్జి అదనంగా విధిస్తారు. తత్ఫలితంగా నిజమైన వేతనాలపై ప్రతికూల ప్రభావం చూపింది' అని ఆయోన్ హెవిట్ ఇండియా భాగస్వామి ఆనంద్ రూప్ ఘోష్ అన్నారు. 2007లో టెలికం, బ్యాంకింగ్, ఆర్థిక సేవల, బీమా రంగ సేవల్లో నికర లాభాలు మెరుగ్గా ఉన్నాయని ఘోష్ తెలిపాు.
అన్ని రంగాల్లోనూ వేతనాల పెంపు ఇలా తగ్గుదల
వినియోగ వస్తువులు, లైఫ్ సెన్సెస్ వంటి కొన్ని పరిశ్రమలు గత దశాబ్ది కాలంగా అత్యధికంగా వేతనాలు ఇచ్చిన సంస్థలుగా నిలిచాయి. లైఫ్ సెన్సెస్ రంగ పరిశ్రమల్లో 2007లో వేతనాలు 13.2 శాతం పెరిగితే, 2008లో 16 శాతానికి వ్రుద్ధి చెందగా, 2017లో అదే వేతనాల పెంపు 11.3 శాతానికి పడిపోయింది. స్వల్ప తేడాలతో వినియోగ వస్తువుల్లో 2015లో సగటున ఉద్యోగుల వేతనాలు 13.4 శాతం పెరిగితే 2017లో 10.2 శాతానికి పడిపోతాయని అయోన్ హెవిట్ డేటా పేర్కొంటున్నది.
ప్రతిభను బట్టే వేతనాలు, ఇంక్రిమెంట్లు
వైవిధ్య భరితమైన ఎఫ్ఎంసిజి పరిశ్రమల్లో వేతనాల పెంపు కూడా విభిన్నంగానే ఉన్నది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకించి వినియోగదారుల మార్కెట్ పెరిగిపోగా, భారీ అవకాశాలు లభించాయి. ఎఫ్ఎంసిజి రంగానికి మార్కెట్ ఆధారితంగా ప్రతిభను బట్టే వేతనాల పెంపు, ఇంక్రిమెంట్లు ఉన్నాయని డాబర్ ఇండియా హెచ్ఆర్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీ క్రుష్ణన్ తెలిపారు.
ఐటీలో 11 % నుంచి 9.7 శాతానికి పతనం
భారతదేశంలోకెల్లా అత్యధికులు ఉపాధి పొందుతున్న రంగం ఇన్ఫర్మేషన్ టెక్నలజీ. కానీ వేతనాలు చాలా తక్కువగా పెరిగాయి. నాస్కమ్ అంచనా ప్రకారం ఐటీ - బీపీఎం పరిశ్రమల్లో 39 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఐటీ రంగంలో 15.4 శాతం నుంచి 10.6 శాతానికి వేతనాల పెంపు తగ్గిపోయిందని ఆయోన్ హెవిట్ పేర్కొన్నది. ఆర్థిక మాంద్యం నుంచి బయట పడిన తర్వాత 2009లో 2.9 శాతం పెంచారు. తిరిగి 2010లో వేతనాల పెంపు 11 శాతానికి చేరుకోగా తిరిగి ఈ ఏడాది 9.7 శాతానికి పడిపోయాయి.
ఇక నిపుణులకే ఐటీ రంగంలో భారీ వేతనాలు
సాఫ్ట్ వేర్, కన్సల్టింగ్ సర్వీసులు తదితర సంప్రదాయ ఐటీ సేవల్లో వేతనాల పెంపు క్రమంగా దిగజారిపోవడం తనకు ఆశ్చర్యం కలుగలేదని, వేతనాల తగ్గింపునకు ఆటోమేషన్, రోబోటిక్స్ పద్ధతులు కారణం అయ్యాయని హెడ్రిక్ అండ్ స్ట్రగుల్స్ పార్టనర్ వెంకట్ శాస్త్రి పేర్కొన్నారు. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో ఐటీ రంగంలో పూర్తిస్థాయి ఉద్యోగుల నియామకంలో ఒడిదొడుకలు చోటు చేసుకుంటాయని అన్నారు. రోబోటిక్స్, ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్ తదితర రంగాల్లో నిపుణులైన వారికి మాత్రమే నూతన ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. క్రియేషన్, సొల్యూషన్ మోడలింగ్, ప్రాబ్లం సాల్వింగ్, డిజైన్ థింకింగ్, ఇన్నోవేషన్ తదితర రంగాల్లో 12 - 15 శాతం పెరిగే అవకాశం ఉన్నది. వినియోగ ఉత్పత్తులు, ఆటోమొబైల్ రంగాల్లో మాత్రమే ఒకింత మెరుగైన స్థాయిలో వేతనాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.