శవాలను తీసుకెళ్లండి పాకిస్థాన్కు అవకాశం ఇచ్చిన భారత్...!
జమ్ము కశ్మీర్లోని కుప్వార జిల్లా సరిహద్దు వెంట కాల్పుల్లో మృతి చెందిన పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ సభ్యుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు భారత దేశం, పాకిస్థాన్కు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ నుండి వచ్చేవారు తెల్లజెండాలతో వచ్చి మృతుల అంతిమ సంస్కరాలు నిర్వహించుకోవాలని సూచించింది. అయితే భారత భద్రతా అధికారలు సూచనపై పాకిస్థాన్ ఇంకా స్పందించలేదు.
జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లా కీరన్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద చొరబడడానికి ప్రయత్నించిన బ్యాట్ సభ్యులను భారత సైనికులు హతమార్చారు. బ్యాట్ దాడి యత్నం జులై 31న అర్ధరాత్రి తర్వాత, ఆగస్టు 1 తెల్లవారుజాము వేళలో జరిగినట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. కాగా మృతులు పాక్ సైన్యానికి చెందిన కమాండోలుగానీ, ఉగ్రవాదులుగానీ అయి ఉండోచ్చని భావిస్తున్నారు.
కశ్మీర్ లోయలో శాంతికి భగ్నం కలిగించడానికి, అమర్నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకుని పాక్ గత 36 గంటల్లో పలు ప్రయత్నాలు చేసిందని రక్షణశాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.భారత సైనిక పోస్టులపై దాడికి యత్నించిన పాక్ బ్యాట్ బృందం కుయుక్తులను మన దేశ సైనికులు సమర్థంగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే.