జమిలి ఎన్నికల పై కీలక చర్చలు, నిర్ణయాలు- ముహూర్తం ఫిక్స్..!!
జమిలి ఎన్నికల పై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం కొనసాగుతోంది. న్యాయ పరమైన చిక్కుల పై జమిలి ఎన్నికల పైన నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ చర్చలు చేసింది. తాజా చర్చల వేళ జమిలి బిల్లులకు అసెంబ్లీల ఆమోదం అవసరం లేదని లా కమిషన్ తేల్చి చెప్పింది. దీంతో.. వచ్చే బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల వేదిక గా కేంద్రం కీలక నిర్ణయానికి సిద్దం అవుతోంది. ఈ దిశగా కసరత్తు మొదలైంది.
'ఒక దేశం- ఒకేసారి ఎన్నికలు' లక్ష్యంతో జమిలి ఎన్నికల నిర్వహణ పైన కసరత్తు వేగవంతం అయింది. జమిలి బిల్లులకు రాష్ట్రాల శాసనసభల ఆమోదం అవసరం లేదని లా కమిషన్.. సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి తెలిపింది. ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగంలోని మౌలిక స్వరూపాన్ని మార్చేందుకు ఏమీ ప్రయత్నించడం లేదని పేర్కొంది. సమాఖ్య నిర్మాణానికి భంగకరమయ్యేలా రాజ్యాంగ నిబంధనల్నీ మార్చడం లేదని స్పష్టం చేసింది. ఈ బిల్లులకు సంబంధించి ఇప్పటికే పలు వర్గాలతో చర్చించిన జేపీసీ, తాజాగా లా కమిషన్తో కూడా విస్తృత చర్చలు జరిపింది. మరో రెండు నెలల్లో మరింత మంది నిపుణులు, సంస్థలతో చర్చలు జరిపిన తర్వాత నివేదికను రూపొందించి వచ్చే బడ్జెట్ సమావేశాలలోపు సమర్పించనుంది.

జేపీసీ నివేదికను ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, రాజ్యాంగంలోని 368వ అధికరణ కింద జమిలి ఎన్నికల నిర్వహణకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని 23వ లా కమిషన్ చైర్మన్ జస్టిస్ దినేశ్ మహేశ్వరి.. జేపీసీ సభ్యులకు వివరించారు. ఈ రాజ్యాంగ సవరణకు కనీసం 50 శాతం అసెంబ్లీలు ఆమోదించాల్సిన అవసరమేదీ లేదన్నారు. జమిలి ఎన్నికల కోసం ప్రవేశపెట్టే ప్రతిపాదనలన్నీ రాజ్యాంగ పరిమితి మేరకే ఉన్నాయని, లోక్సభ, శాసనసభల ఎన్నికల షెడ్యూలును ఒకే తేదీల్లో నిర్ణయించడం వల్ల ప్రజల ఓటు హక్కుకేమీ నష్టం వాటిల్లదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా లోక్సభ, శాసనసభల కాలపరిమితికి సంబంధించి ఆందోళన కూడా అవసరం లేదని జేపీసీ సభ్యులకు లా కమిషన్ తెలిపింది. రాష్ట్ర శాసనసభల ఎన్నికలకు సంబంధించి కూడా చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకే ఉందని తెలిపింది.
అందువల్ల ఈ మేరకు బిల్లులు చేసే అధికారం పార్లమెంట్కే ఉంటుందని స్పష్టం చేసింది. 82ఏ (3), 82ఏ(5) క్లాజుల కింద ఎన్నికల కమిషన్కు విస్తృత అధికారాలు కల్పించడంపై వచ్చిన సందేహాలను కమిషన్ నివృత్తి చేసింది. రాజ్యాంగంలోని 324 అధికరణ కింద ఇప్పటికే ఎన్నికల కమిషన్కు విస్తృత అధికారాలున్నాయని, ఇప్పటికే ఉన్న కమిషన్ అధికారాలను సంబంధిత క్లాజులు మరింత స్పష్టీకరిస్తాయని వివరించింది. దీంతో, ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో నివేదిక ప్రవేశ పెట్టిన తరువాత.. చర్చ.. కేంద్రం తీసుకునే తుది నిర్ణయం పైన రాజకీయంగా ఉత్కంఠ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications