పార్వతమ్మ రాజ్ కుమార్ అంత్యక్రియలు: జాతీయ జెండాకు అవమానం అంటూ కోర్టులో!
బెంగళూరు: స్యాండిల్ వుడ్ లో 80కి పైగా సినిమాలను నిర్మించిన గుర్తింపు తెచ్చుకున్న మహిళ, కన్నడ సూపర్ స్టార్ దివంగత డాక్టర్ రాజ్ కుమార్ సతీమణి పార్వతమ్మ రాజ్ కుమార్ అంత్యక్రియల సందర్బంగా జాతీయ జెండాకు అవమానం జరిగిందని ఆరోపిస్తూ ఓ న్యాయవాది బెంగళూరు కోర్టును ఆశ్రయించారు.
పార్వతమ్మ రాజ్ కుమార్ అంత్యక్రియల సందర్బంగా జాతీయ జెండాను ఉపయోగించారని బెంగళూరు నగరంలోని విజయనగరకు చెందిన న్యాయవాది చేతన్ ప్రైవేటు కేసు దాఖలు చేశారు. మిలటరీ అధికారులు మరణించిన సమయంలో జాతీయ జెండాను వారి పార్థీవ శరీరంపై పెడుతారని న్యాయవాది చేతన్ అంటున్నారు.
అయితే ఎలాంటి హోదా లేకుండా, కేవలం సినిమాలు నిర్మించిన పార్వతమ్మ రాజ్ కుమార్ పార్థీవశరీరం మీద జాతీయ జెండాను పెట్టడం చట్టపరంగా నేరం అని న్యాయవాది చేతన్ అంటున్నారు. బెంగళూరు నగరంలోని 24వ ఏసీఎంఎం న్యాయస్థానంలో చేతన్ ప్రైవేటు కేసు దాఖలు చేశారు.
నియమాలు ఉల్లంఘించి ప్రవర్థించిన కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి, బెంగళూరు నగర పోలీసు కమిషనర్ మీద చర్యలు తీసుకోవాలని కోర్టులో ప్రైవేటు కేసు వేశారు. చేతన్ వేసిన ప్రైవేటు కేసు విచారణకు కోర్టు అనుమతి ఇవ్వాల్సి ఉంది.