Crime News: క్యాబ్ బుక్ చేశారు.. డ్రైవర్కు మద్యం తాగించి కారు ఎత్తుకెళ్లారు..
క్యాబ్ బుక్ చేస్తారు.. కారు రాగానే కారులో సిటి అంతా తిరుగుతారు. డ్రైవర్ తో చాలా బాగ మాట్లాడతారు. వీరు తింటే అతడికి తినిపిస్తారు. వీళ్లు మంచివాళ్లు అని డ్రైవర్ నమ్మేలా చేస్తారు. ఆ తర్వాత పార్టీ చేసుకుందామని చెప్పి డ్రైవర్ ఫుల్లుగా మద్యం తాగిస్తారు. డ్రైవర్ మత్తులో ఉండగా కారును ఎత్తుకెళ్తారు. వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటకు చెందిన మేకె మంజ, అతని భార్య వేదవతి అలియాస్ జ్యోతి బెంగళూరులో నివసిస్తూ ఉంటారు. అయితే మంజ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. దీంతో అతని రౌడీషీట్ ఓపెన్ చేశారు పోలీసులు. కొద్ది రోజుల క్రితం మంజ, జ్యోతి యలహంకలోని నాగేనహల్లి గేట్ వద్ద ఓలా కారు బుక్ చేసుకున్నారు. కారు రాగానే అందులో ఎక్కి నగరంలోని వివిధ ప్రాంతాలు తిరిగారు.
డ్రైవర్ శివశంకర్తో మంచిగా మాట్లాడుతూ రూమ్ లో పార్టీ చేసుకుందామని తీసుకెళ్లారు. డ్రైవర్ కు ఫుల్లుగా మద్యం తాగించారు. ఆ మత్తులో డ్రైవర్ కారులో పడుకున్నాడు. మంజ డ్రైవల్ జేబులోని తాళాలు తీసుకుని నడుపుకొంటూ వెళ్లి రాజనుకుంటె దగ్గర డ్రైవర్ను బయటికి తోసేశాడు. తోసేసే ముంది శివశంకర్ మొబైల్ను తీసుకున్నాడు. అయితే మత్తు నుంచి తేరుకున్న డ్రైవర్ యలహంక ఉపనగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్, ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి కారు, రెండు మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. మంజపై హత్య, హత్యాయత్నం, దోపిడీ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.