హిందూ అనే పదం పురాణాల్లో ఎక్కడా లేదు..! కమల్ హాసన్ మరో వివాదాస్పద వ్యాఖ్య..!!
చెన్నై/హైదరాబాద్ : గాడ్సే వివాదం పూర్తిగా సమసి పోక ముందే విలక్షణ నటుడు కమల్ హాసన్ మరో సంచలన వ్యాఖ్యలకు తెరలేపారు. తాజాగా హిందూ సమాజం పై అస్త్రాన్ని గురిపెట్టారు. ప్రముఖ నటుడు, ఎంఎన్ఎం అధినేత కమల్హాసన్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పురాణాల్లో హిందూ అనే పదం లేదన్న ఆయన.. హిందూ పదాన్ని భారత్పై దండెత్తిన విదేశీయులు తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. పురాణాల్లో హిందూ పదమే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. 12 మంది ఆళ్వారులు కానీ, 63 మంది నయనారులు కానీ వారి కీర్తనల్లో హిందూ అనే పదాన్ని ఎక్కడా ఉచ్ఛరించలేదని చెప్పారు. దీంతో హిందూ సమాజం ఒక్క సారిగా భగ్గుమంటోంది.
మొఘల్ చక్రవర్తులు కానీ, వారికి ముందు వచ్చిన విదేశీ పాలకులు కానీ హిందూ అనే పదాన్ని తీసుకొచ్చారని చెప్పారు. ఆ తర్వాత బ్రిటీష్ హయాంలో హిందూ అనే పదం అధికారికంగా వాడబడిందని తెలిపారు. మనకు ఎన్నో గుర్తింపులు ఉన్నప్పుడు... విదేశీయిలు ఇచ్చిన ఒక పదాన్ని మతంగా వాడాల్సిన అవసరం లేదని చెప్పారు. మనమంతా హిందువు అనే కంటే.. భారతీయులమని పిలిపించుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. స్వతంత్ర భారతదేశంలో తొలి తీవ్రవాది హిందువే. ఆయన పేరు నాథూరామ్ గాడ్సే అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. హిందువులపై కమల్ చేసిన తాజా సంచలన వ్యాఖ్యలు ఏమలుపు తిరిగి ఎక్కడ చిచ్చు రేపుతుందో చాడాలి.