కర్ణాటక బంద్: బెంగళూరు తుస్, ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు బస్సులు, అంతేనా !
వివిద డిమాండ్లు నెరవేర్చడంలో కర్ణాటక ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని పలు కన్నడ సంఘాలు జూన్ 12వ తేదీ సోమవారం కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చారు. అయితే కర్ణాటక బంద్ కు మిశ్రమ స్పందన వచ్చింది.
బెంగళూరు: వివిద డిమాండ్లు నెరవేర్చడంలో కర్ణాటక ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని పలు కన్నడ సంఘాలు జూన్ 12వ తేదీ సోమవారం కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చారు. అయితే కర్ణాటక బంద్ కు మిశ్రమ స్పందన వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు, చిక్కబళ్లాపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బంద్ ప్రభావం కనిపించింది. హుబ్బలి, రామనగర, మైసూరు, తుమకూరు జిల్లాలో పలు పట్టణాల్లో బంద్ ప్రభావం కనపించింది. కొన్ని జిల్లాల్లో అన్ని దుకాణాలు, హోటల్స్, పాఠశాలలు మూసి వేశారు.

బెంగళూరులో !
బెంగళూరు నగరంలో బంద్ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. ఎప్పటిలాగే బెంగళూరు సిటీ బస్సులు (బీఎంటీసీ) సంచరించాయి. మొదట బంద్ కు ఆటో డ్రైవర్ల సంఘం నాయకులు మద్దతు ఇచ్చినా చివరి నిమిషయంలో మద్దతు ఉపసంహరించుకున్నారు.

సొంత ఊర్లకు వెళ్లి !
కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లో పలు విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. అయితే ప్రభుత్వ పాఠశాలలకు మాత్రం సెలవు ప్రకటించలేదు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని సొంత ఊర్లకు వెళ్లిన వారు సోమవారం బెంగళూరు చేరుకోవడానికి కొంత ఇబ్బంది పడ్డారు.

ఆంధ్ర, తెలంగాణ బస్సులు !
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, మదనపల్లి, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, కదిరి, కుప్పం తదితర ప్రాంతాలతో పాటు తెలంగాణ నుంచి బెంగళూరు వచ్చిన బస్సులు నగర శివార్లలోనే నిలిపివేశారు. తమిళనాడు నుంచి వచ్చిన బస్సులు సైతం బెంగళూరు నగర శివార్లలోనే నిలిపివేశారు.

వర్షం దెబ్బతో ఆటంకం
సోమవారం వేకువ జామున నుంచి బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో పలు ప్రాంతాల్లో వర్షం పడింది. వర్షం దెబ్బకు బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. బెంగళూరులో ఎప్పటిలాగే అన్ని వ్యాపారాలు జరిగాయి. దుకాణాలు,హోటల్స్, మాల్స్ తీశారు.

సినిమా థియేటర్లు !
కర్ణాటక బంద్ కు కన్నడ చిత్రపరిశ్రమ మద్దతు ఇచ్చింది. బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని అన్ని సినిమా థియేటర్లు మూతపడ్డాయి. బంద్ చేస్తున్న సంఘాల నాయకులు ఎక్కడ దాడి చేస్తారో అనే భయంతోనే సినిమా థియేటర్లు మూసి వేశారని సమాచారం.

కన్నడ సంఘాల నేతలు అరెస్టు !
బెంగళూరు నగరంతో సహ పలు ప్రాంతాల్లో బంద్ కు పిలుపునిచ్చిన పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలు ఎక్కువ కాకుండా ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దించింది. సోమవారం ఉదయమే కొందరు నాయకులను పోలీసులు అరెస్టు చేశారని మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి.

బస్సుల చక్రాలు, రోడ్లలో !
కర్ణాటకలోని పలు చోట్ల కేఎస్ఆర్ టీసీ బస్సుల చక్రాలకు గాలి తీసేశారు. రోడ్ల మీద టైర్లకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలో చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications