సోనియాకు షాక్: ఇక ‘యూపీఏ’ లేదు, శరద్ పవార్తో భేటీ అనంతరం మమతా బెనర్జీ సంచలనం
ముంబై: దేశంలో కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని భర్తీ చేసేందుకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. బీజేపీకి బలమైన ప్రత్యర్థిగా ఎదిగేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మమతా బెనర్జీ తాజాగా మాహారాష్ట్రలో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు కీలక నేతలతో సమావేశమయ్యారు.
యూపీఏ లేదంటూ మమతా బెనర్జీ సంచలనం
బుధవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను ముంబైలో ఆయన నివాసంలో కలిశారు. ఆయనతో భేటీ అనంతరం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్(యూపీఏ) అంటే ఏమిటి? అలాంటిదేమీ లేదు అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు దేశంలో యూపీఏ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ప్రస్తుతం యూపీఏ ఛైర్ పర్సన్గా సోనియా గాంధీ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
కాంగ్రెస్ స్థానంలో టీఎంసీ కోసం మమత ప్రయత్నాలు
శరద్ పవార్తో రాజకీయ అంశాలు చర్చించానని.. పవార్ అభిప్రాయాలతో తాను పూర్తిగా ఏకీభవించానని చెప్పుకొచ్చారు. కేంద్రంలో 2014కు ముందు రెండు సార్లు అధికారం చెలాయించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ఇప్పుడు మనుగడలో లేదని కాంగ్రెస్ లక్ష్యంగా మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం దేశంలో నియంతృత్వం కొనసాగుతోందని, దానిపై ఎవరూ పోరాడటం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో బలమైన ప్రత్యామ్నాయానికి ఆవశ్యకత ఏర్పడిందని చెప్పారు.
వచ్చే ఎన్నికల కోసమేనంటూ శరద్ పవార్
ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ.. ప్రస్తుత నాయకత్వానికి బలమైన ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందు ఉంచాలన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే ఏ పార్టీనైనా ముందుకొస్తే.. స్వాగతిస్తామన్నారు. అయితే, అది కాంగ్రెస్ పార్టీకీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో భావసారూప్యత కలిగిన పార్టీలు సంయుక్త నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది మమత ఆలోచన అని.. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అందించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. తాము ఆలోచించేది ఈ ఒక్కరోజు కోసం కాదని.. రాబోయే ఎన్నికల కోసమని, దానికి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని శరద్ పవార్ వ్యాఖ్యానించారు.
మమత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్
తాజా పరిణామాలపై స్పందించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఓడించాలనుకోవడం కేవలం కలేనని చెబుతూ దీదీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. దేశ రాజకీయాల వాస్తవితక ఏంటో ప్రతి ఒక్కరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఇది ఇలావుండగా, ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లోని ముఖ్య కాంగ్రెస్ నేతలకు గాలం వేసిన టీఎంసీ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి టీఎంసీని బీజేపీకి ప్రత్యామ్నాయంగా మార్చే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మమతా బెనర్జీ ఇటీవల పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలతో సమావేశమై చర్చలు జరుపుతున్నారు. గత నెలలో మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా సహా 12 మంది ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో.. మేఘాలయ ఎన్నికల్లో పోటీ చేయకుండానే టీఎంసీ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. కాగా, ఇదంతా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో జరుగుతోందని చర్చ జరుగుతోంది.