రణమా..శరణమా: ఇక బంతి శివసేన కోర్టులో: నో 50-50 ఫార్ములా..ఇక మీ ఇష్టం: బాంబు పేల్చిన దేవేంద్ర..!
ముంబై: భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ బాంబు పేల్చారు. మిత్రపక్షం శివసేనతో కయ్యానికి కాలు దువ్వారు. తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధపడ్డార. శివసేనతో కలిసి ముఖ్యమంత్రి పదవిని పంచుకోబోమని తేల్చి చెప్పారు. శివసేన పార్టీ నాయకులు ప్రతిపాదించిన 50-50 ఫార్ములాను అనుసరించడానికి తమ పార్టీ అగ్ర నాయకత్వం అంగీకరించలేదని కుండ బద్దలు కొట్టారు. ఇక మీదట 50-50 ఫార్ములాను మరిచి పోవాల్సిందేనని తేటతెల్లం చేశారు. ఇలాంటి ప్రతిపాదన తప్ప వేరే ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించాలని సూచించినట్లు తెలిపారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆయన ఓ ప్రకటన చేశారు. బీజేపీ నాయకుడే అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉంటారని స్పష్టం చేశారు.
ఇక బంతి శివసేన కోర్టులో..
దేవేంద్ర ఫడణవీస్ చేసిన తాజా ప్రకటనతో.. ఇక బంతి శివసేన కోర్టులో పడినట్టయింది. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా? వద్దా? అని నిర్ణయించుకోవాల్సిన బాధ్యత శివసేన మీద పడింది. ఎన్నికలకు ముందే బీజేపీతో కలిసి సీట్లను సర్దుబాటు చేసుకున్నందున నైతిక విలువలను పాటిస్తూ బీజేపీతో వెళ్లాలా? లేక తన దారి తాను చూసుకోవాలా? అనే అంశంపై తుది నిర్ణయాన్ని రావాల్సిన బాధ్యత ఇక శివసేనపైనే పడింది. బీజేపీతో కలిసి వెళ్తే.. ముఖ్యమంత్రి పదవిని శివసేన చివరి వరకూ అందుకోలేదనేది ఫడణవీస్ చేసిన తాజా ప్రకటనతో వెల్లడైంది.
ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటూ శివసేన ప్రకటించిన కొన్ని నిమిషాల్లోనే..
తాము 50-50 ఫార్ములాకే కట్టుబడి ఉన్నామని, ప్రత్యామ్నాయ మార్గాలు తమ ముందు ఉన్నాయంటూ శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ ప్రకటించిన గంటల వ్యవధిలో దేవేంద్ర ఫడణవీస్ నుంచి ప్రకటన రావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. శివసేన మద్దతు లేనిదే బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. అదే శివసేన మద్దతు తీసుకుని కాంగ్రెస్, దాని మిత్రపక్షం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలవు. ఈ పరిస్థితుల్లో దేవేంద్ర ఫడణవీస్ 50-50 ఫార్ములాను అంగీకరించబోయేది లేదంటూ తేల్చేయడంతో శివసేన నిజంగానే ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటుందా? అనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
ముఖ్యమంత్రిగా చెరో రెండున్నరేళ్లు
ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్ల కాలం పాటు పంచుకోవాలనేది శివసేన ఫార్ములా. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరేను ముఖ్యమంత్రి పదవిపై కూర్చోబెట్టాలనేది వ్యూహం. తొలి రెండున్నరేళ్ల పాటు బీజేపీ మలి రెండున్నరేళ్ల పాటు శివసేన ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలనే ఫార్ములాను తెరమీదికి తీసుకొచ్చింది. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచీ ఇదే ఫార్ములాకు కట్టుబడి ఉంటోంది శివసేన. దీనికి ఏ మాత్రం అంగీకరించట్లేదు బీజేపీ. దీనితో మహారాష్ట్ర రాజకీయ రసకందాయంలో పడినట్టయింది.
కాంగ్రెస్-ఎన్సీపీకి ఛాన్స్ దక్కుతుందా?
మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో అధికారాన్ని అందుకోవాలంటే 145 సీట్ల సంఖ్యాబలం అవసరం అవుతుంది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలు, శివసేన 56 సీట్లను కైవసం చేసుకున్నాయి. ఈ రెండూ కలిస్తే మ్యాజిక్ ఫిగర్ అందుకుంటాయి. 50-50 ఫార్ములాపై ప్రతిష్ఠంభన నెలకొనడంతో బీజేపీకి అధికారాన్ని దూరం చేయడానికి కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి పావులు కదిపే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ కు 44, దాని మిత్రపక్షం ఎన్సీపీకి 54 స్థానాలు ఉన్నాయి. 56 సీట్లు ఉన్న శివసేన ఈ రెండు పార్టీలతో కలిస్తే మొత్తం బలం 154కు చేరుతుంది. దీనితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. శివసేనకు ముఖ్యమంత్రిని వదులుకోవడానికి కాంగ్రెస్, ఎన్సీపీలు సిద్ధంగా ఉన్నాయి. శివసేనతో చేతులు కలపడానికి ఎన్సీపీ నుంచి అభ్యంతరం వ్యక్తమౌతోంది.