ఆలయాల్లో పేలుళ్లకు భారీ ఉగ్ర కుట్ర: ఇద్దరు ఐఎస్ ఉగ్రవాదుల అరెస్ట్
గుజరాత్లో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రానున్న రెండు రోజుల్లో పలు మతపరమైన స్థలాల్లో వరుస పేలుళ్లు జరపడానికి ప్రణాళికలు రచిస్తున్న ఇద్దరు అనుమానిత ఐఎస్ ఉగ్రవాదులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వ
అహ్మదాబాద్: గుజరాత్లో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రానున్న రెండు రోజుల్లో పలు మతపరమైన స్థలాల్లో వరుస పేలుళ్లు జరపడానికి ప్రణాళికలు రచిస్తున్న ఇద్దరు అనుమానిత ఐఎస్ ఉగ్రవాదులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్((ఏటీఎస్) పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీగా పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రంలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు ట్విటర్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా భయానక ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్తో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఏటీఎస్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో 3నెలల నుంచి వారిపై నిఘా కొనసాగించారు. శనివారం రాత్రి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి.. నిందితుల్లో ఒకరైన వసీమ్ రమోడియాను రాజ్కోట్లో, మరో నిందితుడు నయీం రమోడియాను భావ్నగర్లో అరెస్టు చేశారు.
వారిద్దరూ అన్నదమ్ములని ఏటీఎస్ డిప్యూటీ ఎస్పీ కె.కె.పటేల్ ఆదివారం వెల్లడించారు. విదేశాల్లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో వారికి సంబంధాలున్నట్లు తెలిపారు. ప్రఖ్యాత చోటిలా ఆలయం వంటి మతపరమైన స్థలాల్లో రెండు రోజుల్లో వరుస పేలుళ్లకు పాల్పడేందుకు వారు కుట్ర పన్నారని పేర్కొన్నారు.
అందుకోసం బాంబులను తయారుచేసేందుకుగాను అవసరమైన గన్ పౌడర్, బ్యాటరీతో కూడిన స్థానిక బాంబులను సిద్ధం చేసుకున్నారని వెల్లడించారు.ముఖానికి వేసుకునే మాస్కులు, నిషిద్ధ సమాచారంతో కూడిన కంప్యూటర్లను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా, అరెస్టైన ఇద్దరు ఉగ్రవాదులు కంప్యూటర్ సైన్స్ చదివిని విద్యావంతులు కావడం గమనార్హం.