హాట్ రాఖీస్ : బంగారు రాఖీలపై మోడీ, యోగీ ఫోటోలు..ధర తెలిస్తే షాకే..!
మన దేశంలో ఏ చిన్న అవకాశం వచ్చినా క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. ఇది ఎక్కువగా రాజకీయనాయకుల్లో కనిపిస్తుంది. అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకునేందుకు ఎవరూ ఇష్టపడరు. అలాంటిదే ఇప్పుడు మీరు చదవబోతున్నారు. వజ్రాలకు పేరుగాంచింది గుజరాత్లోని సూరత్ నగరం. అందుకే ఈ నగరానికి డైమండ్ సిటీ అని కూడా పేరుంది. ఇక్కడ వజ్రాల వ్యాపారమే ప్రధానంగా సాగుతుంది. ఇక నగలు చేయడంలో ఇక్కడి వారు సిద్ధ హస్తులు. ప్రతి వేడుక ప్రతిబింబించేలా సందర్భానికి అనుగుణంగా నగలు తయారు చేస్తుంటారు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ఆదివారం రాఖీ పౌర్ణమి. అయితే ఓ నగల దుకాణం ఈ వేడుకకు తగ్గట్టుగానే రాఖీలు డిజైన్ చేసింది. అయితే మామూలుగా కాదు ఈ రాఖీలు బంగారంతో చేయబడిన స్పెషల్ పొలిటికల్ రాఖాలు.

దేశంలో ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. అది కాక ఎన్నికలకు ముందు వచ్చే చివరి రాఖీ పర్వదినం. దీనిని పురస్కరించుకురి సూరత్లోని ఓ నగల దుకాణం బంగారు రాఖీలు తయారు చేసింది. ఈ రాఖీలపై ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, గుజరాత్ సీఎం విజయ్ రూపాణీల ఫోటోలున్నాయి. 22 క్యారెట్ల బంగారంతో చేయబడ్డ ఈ పొలిటికల్ రాఖీలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయని నగల దుకాణం యజమాని చెప్పారు. ఇప్పటి వరకు 50 బంగారు రాఖీలు తయారు చేయగా అందులో 47 అమ్ముడుపోయాయని యజమాని చెప్పాడు. అంతేకాదు ఇంకొందరు ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకుంటున్నారని యజమాని చెప్పాడు. ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీలు ఎన్నో మంచి పనులు చేశారని.. దేశ ప్రజలను వారి మంచి పనులతో ప్రభావితం చేశారని దుకాణం యజమాని చెప్పారు. బంగారం రాఖీలు రూ.50వేల నుంచి రూ.70వేలు ధర పలుకుతుందని వివరించాడు.

నరేంద్ర మోడీ ఫోటో ఉన్న రాఖీ తన సోదరుడికి కట్టడం ద్వారా ప్రధానిలా తను కూడా సమాజానికి పనికొచ్చే మంచి పనులు చేయాలని దీవిస్తానని ఈ నగల దుకాణంలో బంగారం రాఖీని కొనుగోలు చేసిన శ్రద్ధ అనే కస్టమర్ చెప్పారు. ఇక రాఖీ పండగ పురస్కరించుకుని కేవలం బంగారు రాఖీలే మార్కెట్లో దర్శనమివ్వడంలేదు... లడ్డూలపై బంగారు పూత పూసిన రాఖీలు కూడా దొరుకుతున్నాయి. ఆ లడ్డూ ధర ఎంతో తెలుసా... అక్షరాల రూ.9వేలు.












Click it and Unblock the Notifications